జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!
టీడీపీ మాజీ ఎంపీ , సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుంది. తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని దివాకర్ రెడ్డి ఓవైపు రాజకీయ విమర్శలు చేస్తుంటే...మరోవైపు అధికారులు మాత్రం జేసీ ట్రావేల్స్ బస్సులపై విరుచుకుపడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిరుగుతున్నాయంటూ... వాటిని సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 80 బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు మరోసారి సీజ్ చేసి షాక్ ఇచ్చారు.
జేసీ దివాకర్ రెడ్డికి అధికారులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. పదిహేను రోజుల్లో జేసీ ట్రావెల్స్కు చెందిన బస్సులను మరికొన్నింటిని సీజ్ చేశారు. గడిచిన వారంలో రోజుల్లోనే ఆయన బస్సులను సీజ్ చేయడం రెండవసారి. స్టేజీ క్యారియర్స్ పర్మిట్లలో సరైన అనుమతులు లేకపోవడంతో కాంట్రాక్టు బస్సులను కూడ సీజ్ చేశారు.
గత వారం క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొందరిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్పై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హద్దు మీరి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్పోర్టులో తమకు 74 ఏళ్ల అనుభవం ఉందని అన్నారు. ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 80 బస్సులు సీజ్ చేశారని జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బస్సు టైమింగ్ రాలేదని సీజ్ చేస్తున్నారని..... ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.