కియా..అనిశ్చిత పరిస్థితుల్లో అంచనాలకు మించిన బుకింగ్స్: అనంతపురం ప్లాంట్ విస్తరణ దిశగా..!
అనంతపురం: దక్షిణ కొరికయాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా.. సరికొత్త రికార్డును సృష్టించింది. కార్ల అమ్మకాలను ప్రారంభించిన తొలి రెండు నెలల వ్యవధిలోనే దేశంలోనే అతి పెద్ద మూడో కార్ల విక్రయ సంస్థగా ఆవిర్భవించింది. కిందటి నెలలో అంచనాలకు మించిన కార్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. బుకింగ్లు సైతం భారీగా నమోదు అయ్యాయి. ఫలితంగా- అనంతపురం పెనుకొండ సమీపంలో నిర్మించిన కార్ల తయారీ యూనిట్ను మరింత విస్తరించడానికి కసరత్తు చేస్తోంది.
Recommended Video
కరెక్షన్.. కియా: ట్వీట్ డిలేట్ చేసిన రాయిటర్స్..!
కిందటి నెలలో 15,644 యూనిట్లు..
కిందటి నెలలో 15,644 కార్లను విక్రయించినట్లు కియా మోటార్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో సెల్టోస్-14024, కార్నివాల్-1620 కార్లు విక్రయమైనట్లు పేర్కొంది. జనవరితో పోల్చుకుంటే 1.3 శాతం అధికంగా విక్రయాలు రికార్డు అయ్యాయని, దీనితోపాటు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. వచ్చే వేసవి నాటికి మరిన్ని కార్లను విక్రయించాల్సి ఉందని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన లక్ష్యాలను అందుకుంటున్నామని వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురం ప్లాంట్ను విస్తరించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.
కియా మోటార్స్ తరలిపోతోందంటూ..
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలకు భయపడి కియా మోటార్స్ సంస్థ తమిళనాడుకు తరలిపోతోందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో.. ఉన్న చోటే విస్తరణ కోసం కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకోవడం, అలాంటి అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొన్న సమయంలోనే.. అంచనాలకు మించి కార్ల అమ్మకాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.