కరవు నేలకు జలసిరి: హంద్రీనీవాకు చేరిన కృష్ణా వరద జలాలు!
అనంతపురం: మన రాష్ట్రంలో కరవు ప్రభావిత జిల్లాల్లో ఎప్పుడూ టాప్ లో ఉండే జిల్లా అనంతపురం. రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురిసినప్పటికీ.. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆశించిన స్థాయిలో చినుకు కూడా రాలదు. భూగర్భ జలాల మాట అటుంచితే.. కనీసం భూమి తడిచేలా కూడా వర్షాలు కురవని జిల్లాలు అవి. ఈ వర్షాకాలంలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం సీమ జిల్లాల్లో కనిపించింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పైగా కృష్ణానదికి సంభవించిన వరద దీనికి తోడు కావడంతో.. మరో ఏడాది పాటు నీటి కోసం వెంపర్లాడే పరిస్థితి తప్పినట్టయింది. శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువన నిర్మించిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసిన కృష్ణా జలాలు అనంతపురం నేలను స్పృశించాయి. ఈ నీటిని హంద్రీనీవా సుజల స్రవంతి రెండో ఫేజ్ కాలువకు విడుదల చేశారు.
టీటీడీకి భారీ విరాళాన్ని అందజేసిన విశాఖ వ్యాపారి
జిల్లాలోని బెళుగుప్ప మండలంలో నిర్మించిన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువకు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ కృష్ణా వరద నీటిని విడుదల చేశారు. దాదాపు పదేళ్ల తరువాత జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ కాలువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.
అనంతరం ఆయన హెడ్ రెగ్యులేటర్ వద్ద అనంతపురం లోక్ సభ సభ్యుడు తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి (ధర్మవరం), డాక్టర్ పీవీ సిద్దారెడ్డి (కదిరి) కలెక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణా వరదనీటికి పూజలు చేశారు. కృష్ణా జలాల రాకతో జిల్లాలోని అన్ని చెరువులను నింపవచ్చని జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జీడిపల్లి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.68 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్లో 1.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రస్తుతానికి రెండో దశ కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో ఆధారంగా వరద ప్రవాహాన్ని పెంచే అవకాశాలు లేకపోలేదు. రాయలసీమలో చిట్టచివరి జిల్లాగా ఉన్న అనంతపురం వరకూ కృష్ణా జలాలు పారడం ఈ నాలుగు జిల్లాలకు కొద్దో గొప్పో ఊరటను ఇచ్చే అంశమే. కొద్దిరోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా తడిచి ముద్దయిన విషయం తెలిసిందే.
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అతిపెద్దదైన ధర్మవరం చెరువు దాదాపు నిండిపోయింది. చిన్నా, చితక చెరువుల్లో వర్షపు నీరు నిల్వ ఉంటోంది. హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాలు పారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను ఆధారంగా చేసుకుంటే. ఈ వేసవి సీజన్ లో అనంతపురం జిల్లాకు మంచినీటి, సాగునీటి అవసరాలు దాదాపు తీరినట్టే కనిపిస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.