లోకసభ ఎన్నికలు 2019 : అనంతపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
అనంతపురం ... ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా .దీని చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జాలువారే జలపాతాలకూ, ఆధ్యాత్మిక పరిమళాలను పంచే ఆలయాలకూ అనంతపురం పెట్టింది పేరు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధమైన పెనుగొండ, రత్నగిరి, రాయదుర్గం తదితర కోటలు ఉన్నాయి. విజయనగర రాజుల చరిత్రలో పెనుగొండకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వేసవి విడిదిగా, తన రెండవ రాజధానిగా పెనుగొండ నుంచి పరిపాలించారు.
విజయనగర రాజుల కాలంనాటి శిల్ప కళాచాతుర్యానికి మచ్చుతునక అనంతపురం జిల్లాలోని లేపాక్షి. దేశంలోని నూట ఎనిమిది శైవ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ గ్రామం బయట 9 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు ఉన్న నంది విగ్రహం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. జిల్లాలో అతి పటిష్టమైన దుర్గంగా గుత్తి కోటకు ఎనలేని ఖ్యాతి ఉంది. ఇప్పటికీ గత వైభవాన్ని చాటి చెబుతూ విజయనగర రాజుల విజయ చిహ్నం, గజలక్ష్మి ఆకృతులు ఈ కోట గోడల మీద దర్శనం ఇస్తాయి.
అనంతపురం జిల్లా ఆధ్మాత్మిక కేంద్రాలకు నెలవు. అనంతపురం నగర శివారులోని ఇస్కాన్ మందిరం, కదిరి నరసింహస్వామి దేవాలయం, సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి), చింతల వెంకటరమణస్వామి దేవాలయం (తాడిపత్రి), బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (తాడిపత్రి), కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెన్నహోబిలం నరసింహస్వామి దేవాలయం... ఇలా సందర్శనీయ ఆలయాలెన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం కూడా ఈ జిల్లాలోనే ఉంది.
ఇక రాజకీయ పరిస్థితులు చూస్తే అనంతపురం జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ నీడలో కూరుకుపోయింది. రెండు కుటుంబాలు ఆ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఒకటి పరిటాల కుటుంబం మరొకటి మద్దెలచెరువు కుటుంబం. ఈ జిల్లాలో ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షనిజంకు చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. పరిటాల రవి హత్యకు గురికావడంతో జిల్లానే కాదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. ఆ తర్వాత కొన్నేళ్లకు మద్దెల చెరువు సూరి కూడా హత్యకు గురయ్యారు. ఇద్దరు లీడర్లు మృతి చెందడంతో అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది. ఆ రెండు కుటుంబాల కోసం పనిచేసిన వారు కూడా కత్తులకు స్వస్తి పలకడంతో అనంతపురం జిల్లా చైతన్యం వైపు అడుగులు వేసింది.
రాజకీయంగా చూస్తే అనంతపురం జిల్లాకు పెద్ద చరిత్ర ఉంది. అనంతపురం జిల్లా టీడీపీకి పట్టున్న ప్రాంతం అని చెప్పొచ్చు. ఇక్కడ రెండు పార్లమెంటరీ స్థానాలున్నాయి. ఒకటి అనంతపురం రెండోది హిందూపురం. అనంతపురం జిల్లా నుంచి మహామహులు దేశ రాజకీయాల్లో ప్రాతినిథ్యం వహించారు. అక్కడ చక్రం తిప్పారు. హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ హిందూపురం నుంచి గెలిచి కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ అదే హిందూపురం నుంచి 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అంతకుముందు భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా రెండు సార్లు, లోక్ సభ స్పీకరుగా రెండుసార్లు పనిచేసిన నీలం సంజీవరెడ్డి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఈ ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం.
అనంతపురం పార్లమెంటరీ కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాలున్నాయి. అనంతపురం పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మూడుసార్లు టీడీపీ ఒకసారి కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి నిలిచారు. జేసీ దివాకర్ రెడ్డికి 61,269 ఓట్ల మెజార్టీ దక్కింది. ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటి వరకు పార్లమెంటులో 4 చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. లోక్సభలో ఆయన హాజరు76శాతంగా ఉంది. అనంతపురం పార్లమెంటులో మొత్తం ఓటర్లు 15,36,912 మంది ఉండగా అందులో పురుషులు 7,75,509 మంది, మహిళలు 7,61,403 ఉన్నారు. 2014లో అనంతపురం పార్లమెంటుకు 78 శాతం పోలింగ్ జరిగింది. ఇక బీసీ సామాజిక వర్గం అనంతపురంలో ఎక్కువగా ఉండగా... ముస్లిం సామాజకి వర్గం కూడా ఈ సారి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది.