స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం... బయటపడ్డ గుట్టు.. అడ్డు తొలగించుకునేందుకు హత్య...
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి... అందుకు అడ్డుగా ఉన్నాడని ఏకంగా అతన్ని హత్య చేశాడు. స్నేహితుడని నమ్మి ఇంటికి రానిస్తే సదరు వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా గుత్తిఆర్.ఎస్కి చెందిన అశోక్, యోగి అనే ఇద్దరు వ్యక్తులు చాలా కాలంగా మంచి స్నేహితులు. వృత్తిరీత్యా ఇద్దరూ పెయింటర్స్గా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతో అశోక్ ఇంటికి యోగి తరుచుగా వస్తుండేవాడు. ఈ క్రమంలో అశోక్ భార్యతో యోగి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అశోక్ ఇంట్లో లేనప్పుడు వచ్చి ఆమెతో గడిపి వెళ్లేవాడు.
ఈ విషయం తెలిసి అశోక్ తన భార్య వెంకటలక్ష్మిని మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో వెంకటలక్ష్మి,యోగి కలిసి అశోక్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసిన యోగి... మందు పార్టీ పేరుతో అశోక్ను ఆదివారం(జనవరి 3) సాయంత్రం జడ్పీ స్కూల్ వద్దకు పిలిపించాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అక్కడే యోగి అశోక్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. సోమవారం ఉదయం మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సీఐ రాము, ఎస్ఐ గోపాలుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడలో గుర్తు తెలియని దుండగులు మేడపాటి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు అతని భార్యపై కూడా దాడి చేశారు. మృతుడు సూర్యనారయణ ఒ హత్య కేసులో ప్రధాన నిందతుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షలే హత్యకు దారితీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.