అనంతపురం కలెక్టర్గా ఇంటర్ విద్యార్థిని - ‘బాలికే భవిష్యత్’ అంటోన్న గంధం చంద్రుడు -దేశంలోనే వినూత్నం
సమాజంలో మార్పు కోసం పరితపిస్తూ, ఆ దిశగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల మనసుల్లో గొప్ప స్థానం పొందే అధికారులు అతి కొద్దిమందే. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అలాంటి అధికారుల్లో ప్రముఖుడు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని అధికార బాధ్యతలను బాలికలకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే సారి ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం.
ఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్సీఆర్బీ రిపోర్టులో సంచలనాలు
జిల్లా కలెక్టర్ గా ఇంటర్ బాలిక..
‘బాలికే భవిష్యత్' పేరుతో గంధం చంద్రుడు శ్రీకారం చుట్టిన వినూత్న కార్యక్రమంలో భాగంగా.. ఆదివారం అనంతపురం జిల్లా కలెక్టర్, మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. వీరంతా వివిధ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నవారే కావడం విశేషం. అనంతపురం జిల్లా కలెక్టర్గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్గా ఆమె ఇవాళ(ఆదివారం) బాధ్యతలను నిర్వహించారు. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా.. పక్కనే చంద్రడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు.
జిల్లా అంతటా బాలికలే అధికారులు..
జిల్లా కలెక్టర్ గా ఇంటర్ విద్యార్థిని శ్రావణి బాధ్యతలు చేపట్టిన సమయానికే.. జిల్లా అంతటా వివిధ మండలాల్లో తహశీల్దార్, ఆర్ఐలుగా ఇతర బాలికలు డ్యూటీల్లో చేరారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాలికలు ఆ పదవిలో ఉంటారు. ‘బాలికే భవిష్యత్' కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా కాకుండా అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన బాలికలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని వెంటనే అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు శనివారే ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేసే అధికారాలను సైతం బాలికలకు కట్టబెట్టడం విశేషం.
చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే
ఆఫీసుల్లో ఆనందోత్సాహాలు..
సాధారణంగా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజు. కానీ ఇవాళ అనంతపురం జిల్లా అంతటా ప్రభుత్వ ఆఫీసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జిల్లా కలెక్టర్, తహశీల్దార్లు, ఆర్ఐలుగా బాలికలు ఒకరోజు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తహసిల్దార్ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. రైతులకు, మహిళలకు ఎలాంటి సేవలు అందిస్తామో ఆయా విద్యార్థినులు గుక్కతిప్పుకోకుండా ప్రసంగాలు చేశారు.
Recommended Video
హ్యాట్సాఫ్ గంధం చంద్రుడు
ఆడపిల్లల హక్కులను కాపాడేందుకు, స్వావలంబన దిశగా వాళ్లను నడిపించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా అక్టోబర్ 11న ‘‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం'' జరపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ మేరకు 2012 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 11న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాదికిగానూ ‘‘మై వాయిస్, అవర్ ఈక్వల్ ఫ్యూచర్'' థీమ్ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. దేశంలోని అన్ని జిల్లాలకంటే గొప్పగా అనంతపురంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా, వినూత్నంగా నిర్వహించిన కలెక్టర్ గంధం చంద్రుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కొవిడ్ నియంత్రణ చర్యల్లో వినూత్న ఐడియాలతో ఆయన కేంద్రం మెప్పును కూడా పొందడం తెలిసిందే.