గర్భిణీ అని కూడా చూడలేదు.. రైలు నుంచి తోసేశారు.. కొండవీడు ఎక్స్ప్రెస్ లో దొంగల బీభత్సం
అనంతపురం : కొండవీడు రైలులో దొంగలు రెచ్చిపోయారు. గర్భిణీ అని చూడకుండా ప్రయాణీకురాలిని రైలు నుంచి కిందకు తోసేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే..
బాత్రూమ్ కు వెళ్లి వస్తున్న దివ్య అనే ప్రయాణీకురాల్ని నిలువరించిన దొంగలు దారికి అడ్డంగా నిలబడ్డారు. ఆమె మెడలోంచి బంగారు గొలుసు తెంపే ప్రయత్నం విఫలం కావడంతో.. రైలు నుంచి కిందకు నెట్టివేశారు. తర్వాత వారు కూడా రైల్లోంచి దూకి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
దొంగల బీభత్సంతో దివ్య అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి చేరువలో ఉన్నవారు ఆమెను గమనించి 108 సిబ్బందికి సమాచారమివ్వడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గర్భిణీ కావడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దివ్య.. తన భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉండటంతో అక్కడకు వెళ్లడానికి అత్తతో కలిసి కొండవీడు ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.