అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఏపీలో రెవెన్యూ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగాఅనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం రైతు కొండారెడ్డి నుంచి రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఎసిబి అధికారులకు అందిన సమాచారంతో పక్కాగా ట్రాప్ చేసి పట్టుకున్నారు .
పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం కోసం రైతు కొండారెడ్డిని రెవెన్యూ అధికారి లంచం అడిగినట్లుగా, కొండారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇక రైతునుంచి రెవెన్యూ అధికారి పదిహేను వందల రూపాయల లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కి వెళ్లిన ఏసీబీ అధికారుల రాకను చూసిన రెవిన్యూ అధికారి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు రెవిన్యూ అధికారి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఒకపక్క లంచాల కోసం రైతులను పీడించ వద్దని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారడం లేదు నిత్యం ఎక్కడో ఒక చోట రెవెన్యూ అధికారులు లంచావతారులుగా మారుతూనే ఉన్నారు. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు రెవెన్యూ వ్యవస్థ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.