అతివేగం ఫలితం: అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుమంది దుర్మరణం
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుమంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని తణేకల్లు మండలం పరాకులవాండ్ల పల్లి-ఎర్రగుంటపల్లి గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
కర్నూలు వైపునకు వేగంగా వెళ్తున్న కంటైనర్ ఎదురుగా వస్తోన్న మినీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. మినీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.