నాడు కరవు జిల్లా..నేడు వ్యవసాయంలో కొత్త పుంతలు: అనంత రైలుకు స్కోచ్ అవార్డ్: గంధం చంద్రుడు
అనంతపురం: అనంతపురం.. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా పేరు. దుర్భిక్ష ప్రాంతంగా, కరవు జిల్లాగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన అనంతపురం.. రెండేళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతిని సాధించింది. రెండేళ్లుగా భారీ వర్షాలు పడటంతో అంచనాలకు మించిన స్థాయిలో పంట దిగుబడి చేతికి అందింది. దాని ఫలితంగా- అనంతపురం రైతుల వ్యవసాయ ఉత్పత్తులను దేశ రాజధానికి తరలించడానికి ఉద్దేశించిన కిసాన్ రైలుకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది.
ఉద్యానవన పంట ఉత్పత్తులను తరలించడంలో అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేయడం వల్ల ఈ కిసాన్ రైలును స్కోచ్ అవార్డ్ కోసం ఎంపిక చేసింది కమిటీ. 70వ స్కోచ్ గ్రూప్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్, మేనేజింగ్ డైరెక్టర్ గురుశరణ్ దంజాల్, కేంద్రమంత్రి సురేష్ ప్రభులతో కూడిన కమిటీ అనంతపురం కిసాన్ రైలుకు స్కోచ్ సిల్వర్ అవార్డును ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం మొత్తం 161 ఎంట్రీలు దాఖలు అయ్యాయి.
వాటన్నింటికీ మించి.. అనంతపురం-నిజాముద్దీన్ మధ్య నడిచే కిసాన్ రైలు అద్భుత ఫలితాలను అందుకోవడంతో.. ఈ అవార్డును ప్రకటించాయి. ఉద్యానవన పంట ఉత్పత్తుల్లో అనూహ్య దిగుబడిని సాధించడం, దాన్ని సమర్థవంతంగా దేశ రాజధానికి తరలించడమే ఈ అవార్డు లభించడానికి కారణమైందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పెనుకొండ ఉద్యానవనాల అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ జిల్లా వ్యాప్తంగా కిసాన్ రైలు పట్ల రైతుల్లో అవగాహనను, చైతన్యాన్ని పెంపొందింపజేయగలిగారని ప్రశంసించారు.
It is a great honor to receive this SKOCH Award for Agriculture in Anantapuram. The Department of Horticulture received the Silver for KISAN RAIL, the 1st in South India and the 2nd in the country.
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) January 17, 2021
I thank every one for making this initiative happen and helping the farmers. pic.twitter.com/vfk1n8V4gh
చేతికి అందిన పంటను కిసాన్ రైలు ద్వారా దేశ రాజధానిలో విక్రయించుకోవడానికి వీలు ఉందనే విషయంపై చిన్న, సన్నకారు రైతుల్లో సమగ్రమైన అవగాహనను కల్పించగలిగామని గంధం చంద్రుడు పేర్కొన్నారు. తాము పండిన పంటకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందనే విశ్వాసాన్ని రైతుల్లో పెంపొందింపజేయగలిగామని చెప్పారు. ఫలితంగా- వారు ఉద్యానవన పంటలపై దృష్టి సారించారని, వాటిని సకాలంలో కిసాన్ రైలు ద్వారా మార్కెట్కు చేరవేయగలిగామని అన్నారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు జిల్లాకు దక్కడం పట్ల తనకు గర్వకారణంగా ఉందని గంధం చంద్రడు వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ జిల్లాకు చెందిన ఉద్యానవన శాఖకు గానీ, కిసాన్ రైలుకు గానీ స్కోచ్ అవార్డు దక్కలేదు. దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఉద్యానవన శాఖ, కిసాన్ రైలుకు ఈ అవార్డు లభించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది రెండో అవార్డు.