అనంతపురంలో రైతు ఆత్మహత్య: వైఎస్ జగన్పై విరుచుకుపడ్డ చంద్రబాబు: రైతు లేని రాష్ట్రంగా
అనంతపురం: సంక్రాంతి పండుగ నాడు అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి నాడే ఉగ్రప్ప అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. జిల్లాలోని అమరాపురం మండలం గౌడనకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పొలంలో ఉరి వేసుకున్న స్థితిలో ఉగ్రప్ప కనిపించారు. కొంతకాలంగా పంట చేతికి అందకపోవడం, అప్పుల బాధ తీవ్రతరం కావడం, మద్దతు ధర లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు.
భోగి వేడుకల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ నిర్ణయాల వల్ల సంక్రాంతి చిన్నబోయింది: ఆ జీవోల దగ్ధం
ఉగ్రప్ప ఆత్మహత్య చేసుకోవడంపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రైతాంగ పండుగగా భావించే సంక్రాంతి నాడే ఉగ్రప్ప ఆత్మహత్య చేసుకోవడం తనను కలచి వేస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తోన్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతోన్నాయని మండిపడ్డారు. రైతురాజ్యాన్ని తీసుకొస్తానని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్.. ఇప్పుడు రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
చేతికి అందిన పంటకు మద్దతుధరను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో పంటలకు మద్దతు ధరలేక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ.. వాటిని నిలువరించడంలో జగన్ సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూ చివరికి రైతు లేని రాజ్యంగా మిగిలే ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఉగ్రప్ప కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.