అలా విడుదల..ఇలా వివాదం: పోలీసులపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి: ఘాటు పదాలతో
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. బెయిల్పై కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆయన కనీసం ఇంటికి కూడా చేరకముందే వివాదాలను కొని తెచ్చుకున్నట్టయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. వారిపై దూసుకెళ్లారు. ఘాటు పదాలతో దౌర్జన్యానికి దిగారు. తనకు కేసులు కొత్త కాదని, ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని చెప్పారు.
జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ విడుదల: జగన్ సర్కార్ నాలుగేళ్లే: మరిన్ని కేసులు
వాహనాల ట్యాంపరింగ్, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యారు. కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి 20కి పైగా వాహనాలతో ర్యాలీగా వారిద్దరూ కడప నుంచి అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. అనంతపురం శివార్లకు చేరిన తరువాత.. మరికొందరు అభిమానులు బైక్లతో ఈ ర్యాలీలో కలిశారు.
శివార్లలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీగా తరలివెళ్లకూడదని అన్నారు. రాత్రివేళ లాక్డౌన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సూచించారు. దీనితో కారు నుంచి కిందికి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. వారితో వాగ్యుద్ధం చేశారు. ఎందుకు అడ్డుకున్నారంటూ నిలదీశారు. పోలీసులు చెప్పే విషయాన్ని వినిపించుకోలేదు.
Recommended Video
మళ్లీ అరెస్టు చేస్తావా? ఏం పీకుతావ్? పక్కకు పో అంటూ దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా తరలి వెళ్లకూడదని, వాహనాల రాకపోకలు స్తంభిస్తాయని పోలీసులు చెబుతున్నా పట్టించుకోలేదు. దీన్ని చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడటం పట్ల విమర్శలు తెలెత్తుతున్నాయి.
అలా విడుదల..ఇలా వివాదం: పోలీసులపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి#JCPrabhakarReddy #TDP #Police pic.twitter.com/jLxk3366qJ
— oneindiatelugu (@oneindiatelugu) August 7, 2020