రాష్ట్రంలో ఓ భస్మాసురుడు: జగన్ తెలివైనవాడంటూ జేసీ సంచలనం, టీడీపీ దగ్గర డబ్బులున్నాయ్..
అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఆయన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతోపాటు కీలక అంశాలపై చర్చించారు.
పోలీసులే భయపడతున్నారు..
అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కారణం ఏంటో తెలియదు గానీ.. పోలీసులు కూడా భయపడుతున్నారని జేసీ చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
ఈసీ దగ్గర డబ్బులు లేకుంటే పార్టీ నుంచి..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండదన్నారు. అందుకే తాను ఈసీ రమేష్ కుమార్ను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయని, ఇస్తామని చెప్పారు. కోర్టులు ఎన్నికల విషయం జోక్యం చేసుకోవని చెప్పారు.
సీఎం జగన్ తెలివైనవాడు..
సీఎం జగన్ చాలా తెలివైనవారని అన్నారు. సీఎం చర్యలతో ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని అన్నారు. తాను టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమేనని అన్నారు. రాష్ట్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఉండాలని జేసీ వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు ఒక్కరే ఉండి పోలీసులు ఉంటే సరిపోతుందని అన్నారు.
Recommended Video
రాష్ట్రంలో ఓ భస్మాసురుడు..
రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నారని.. తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటున్నారని.. ఆయనెవరో ప్రజలకు తెలుసని జేసీ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు వేశామని, ఇక పోలింగ్ రోజు ఏజెంట్లు కూర్చున్నా.. పోలీసులు, వైసీపీవాళ్లు కూర్చోనివ్వడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. వాళ్లే ఓట్లు వేసుకుంటారేమోనని.. ఇది చాలా ప్రమాదంగా ఉందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.