ఏపీలో స్ధానిక ఎన్నికలు కష్టమే-జగన్ ఎంతదూరమైనా వెళ్తారు- జేసీ షాకింగ్ కామెంట్స్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం, వాటిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి దీనిపై స్పందించారు. చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చిన ఆయన స్ధానిక సంస్ధల ఎన్నికలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు జగన్పైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎన్నికల సంఘం గురించి ముందుగా జేసీ దివాకర్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సంఘం మాత్రమే ఎన్నికలను నిర్వహించలేదని, అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలని జేసీ దివాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాలనే జేసీ తెలిపారు. అధికారులకు డబ్బు సమకూర్చాల్సింది ప్రభుత్వమేనని జేసీ అన్నారు. ఇలాంటి పరిస్దితుల్లో ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్నారు.
ఏపీలో స్ధానిక ఎన్నికల విషయంలో సీఎం జగన్ వైఖరిపైనా జేసీ దివాకర్రెడ్డి స్పందించారు. తాను అనుకున్న విధంగా స్ధానిక ఎన్నికల వాయిదా కోసం జగన్ ఎంత దూరమైనా వెళ్తారని జేసీ అన్నారు. ఎన్నికలు జరపకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని జేసీ తెలిపారు. దీంతో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. స్ధానిక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఈసీతో పాటు విపక్ష పార్టీలన్నీ కోరుకుంటున్న నేపథ్యంలో జేసీ కామెంట్స్ వారికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఎంతదూరమైనా వెళ్తుందంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.