పాపం పసివాళ్లు: ఆకలికి అలమటించారు.. మట్టితో కడుపునింపుకుని తనువు చాలించారు.
అనంతపురం: కరువు జిల్లా అనంతపురంలో ఆకలి చావులు దర్శనమిస్తున్నాయి. తినేందుకు ఆహారం లేక ఇద్దరు చిన్నారులు మట్టి తిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆకలితో అలమటించి తినేందుకు ఏమీలేక చివరకు మట్టితో కడుపు నింపుకుని శాశ్వతంగా ఆహారానికి దూరమైన ఘటన పలువురిని కదిలిస్తోంది.
ఆకలితో రెండేళ్ల వెన్నెల మృతి
అసలే అనంతపురం జిల్లా. కరువుతో పాటు ఆకలి కేకలు కూడా ఆ జిల్లాలో వినిపిస్తాయి. గత ఆదివారం పోషకాహారలోపం, ఆకలి మంటలతో వెన్నెల అనే రెండేళ్ల చిన్నారి కన్నుమూసింది. తినేందుకు గింజ లేదు. ఆకలికి ఏడ్చి ఏడ్చి తట్టుకోలేకపోయిన చిన్నారి మట్టి తినింది. చిన్నారి ఏమి తింటుందో తెలియని పరిస్థితి. కాని కడుపు మాత్రం నిండింది. కానీ అదే కాలకూట విషమై ప్రాణాలు తీస్తుందని ఆ రెండేళ్ల వెన్నెలమ్మ తెలుసుకోలేకపోయింది. వెన్నెల ఆమె పెద్దమ్మ నాగమణి దగ్గర పెరుగుతోంది. నాగమణి కుటుంబం కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లెలో నివాసముంటోంది.
మట్టి తిని తనువు చాలించిన చిన్నారులు
చిన్నారి వెన్నెల మృతి చెందకముందే నాగమణి మూడేళ్ల కొడుకు సంతోష్ ఆర్నెళ్ల క్రితం పోషకాహారం అందక చనిపోయాడు. అయితే పోలీసుల విచారణలో పిల్లలు ఇద్దరూ ఆకలికి తట్టుకోలేక మట్టి తిని మృతి చెందినట్లు తేలింది. గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే చిన్నారు మృతికి కారణం తల్లిదండ్రుల అలసత్వమే అని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో అందరూ మద్యానికి బానిసలయ్యారని చెప్పారు.పిల్లలకు సరైన ఆహారం అందించలేకపోయారని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ తండ్రి ఆచూకీ దొరకడం లేదని వైద్యులు తెలిపారు. పిల్లలను అలా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు హాస్పిటల్లోని నర్సులు వ్యాక్సినేషన్లు ఇచ్చారు కానీ ఇవి వారిని కాపాడలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు.
మద్యం మత్తులో చిన్నారులను మరచిన కుటుంబం
పోస్టుమార్టం నిర్వహించలేదని చెప్పిన వైద్యులు ... పిల్లలు మాత్రం పోషకాహారలోపం ఆకలి మంటతోనే చనిపోయారని మాత్రం కచ్చితంగా చెప్పగలమని అన్నారు. ఇదిలా ఉంటే కదిరి ఆర్డీఓ ఘటనపై విచారణకు ఆదేశించారు. మహేష్ భార్య అత్త కూడా మద్యానికి బానిసలయ్యారని విచారణలో తేలింది. వెన్నెలను సరిగ్గా చూసుకోలేదని, సరైన ఆహారం అందించలేకపోయారని విచారణలో భాగంగా ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ చిన్నారిని అలానే వదిలేశారని కనీసం హాస్పిటల్కు తీసుకెళ్లి చూపిద్దామన్న ఆలోచన వారికి రాలేదని రిపోర్టులో తెలిపారు.