తాడిపత్రిలో వేట కొడవళ్లతో దాడులు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మృతి
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మీరాపురంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వేట కొడవళ్లతో చెలరేగిన ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు. వారిని భాస్కర్ రెడ్డి (టీడీపీ), పుల్లారెడ్డి (వైఎస్ఆర్సీపీ)గా గుర్తించారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని మీరాపురంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపుల
నియోజకవర్గానికి చెందని వ్యక్తి ఒకరు ఓటు వేయడానికి మీరాపురానికి రావడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన ఓ వ్యక్తి మీరాపురంలో ఓటు వేయడానికి రాగా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు అతణ్ని గుర్తించారు. ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. దీనితో టీడీపీకి చెందిన స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఓటు వేసి తీరాల్సిందేనంటూ పట్టుబట్టారు.
ఇది కాస్తా.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భాస్కరరెడ్డి, పుల్లారెడ్డి మరణించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ముగ్గురు కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాల్లో ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గానికి అదనపు కేంద్ర బలగాల్ని పంపిస్తున్నారు.