ప్రేమించామంటూ వెంటపడి.. యువతి ప్రాణం తీశారు: ఇద్దరు స్నేహితుల ఘాతుకం
అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఓ యువతిని తన స్నేహితులతో దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పటించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్బీఐలో విధులకు వెళ్లి తిరిగిరాలేదు..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తోంది. రోజులానే మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రేమించి వేధింపులు.. స్నేహలత ప్రాణం తీశారు
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. కాగా, రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. చాలా కాలంగా రాజేష్, కార్తీక్లు తమ కూతురు స్నేహలతను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ..
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం ముణీంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ కొత్త జంట కనీసం మూడు నెలలు కూడా గడవకముందే తనువు చాలించారు. వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలం గడ్డూరుకు చెందిన హనుమంతు, యశోదమ్మ దంపతుల కుమార్తె పావని(20)ని మణీంద్రం గ్రామంలో ఆమె మేనమామ గోవిందప్ప కుమారుడు మునిరత్నం(26) ప్రేమ వివాం మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. రెండు నెలల వరకు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే, ఒక నెల రోజుల నుంచి వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
పెళ్లైన 3 నెలలకే.. భార్య మృతదేహాన్ని చూసి భర్త ఆత్మహత్య
ఈ క్రమంలో డిసెంబర్ 16 నుంచి పావని అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మణీంద్రంలోని మామ గోవిందప్ప పొలం వద్ద నీటి కుంటలో పావని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, భార్య మృతదేహాన్ని చూసిన మునిరత్నం మానసిక వేదనను భరించలేక సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త దంపతుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.