అనంతపురంలో ఆ పరీక్షల్లో అవాక్కయ్యే ప్రశ్న ... తెలుగుదేశం పార్టీ గురించి రాయండి
ఏపీలోని అనంతపురం జిల్లాలో బీఏ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవాక్కయ్యే ప్రశ్నాపత్రం ఇచ్చారు. పొలిటికల్ సైన్సు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నలో తెలుగుదేశం పార్టీ గురించి రాయండి అని ఉండడం విద్యార్థులను అవాక్కయ్యేలా చేసింది. అటు విద్యార్థులే కాదు, ఆ ప్రశ్నాపత్రాన్ని చూసిన అధ్యాపకులు, తల్లిదండ్రులు సైతం అవాక్కయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి ప్రశ్నా ప్రశ్నా పత్రములో ఉండడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనంతపురం కళాశాలలో పరీక్షా పత్రంలో అవాక్కయ్యే ప్రశ్న
అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పొలిటికల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో ఐచ్చిక ప్రశ్నగా తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న ప్రశ్న ఇవ్వడంతో పరీక్షకు హాజరైన వారు ఖంగుతిన్నారు. అటానమస్ హోదా ఉన్న ఈ కాలేజీ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుంటుంది. బీఏ సెకండ్ ఇయర్, నాలుగో సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ఎనిమిది అంశాలను ఇస్తూ, అందులో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం రాయాలని చెబుతూ, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులను ఇచ్చింది . తెలుగుదేశం పార్టీ గురించి రాయాలని ప్రశ్న ఇవ్వడం అనంతపురం జిల్లాలో రాజకీయ దుమారం లేపింది.
అభ్యంతరకరంగా తెలుగుదేశం పార్టీ గురించి ప్రశ్న.. కోడ్ ఉల్లంఘనే అంటూ ఆగ్రహం
ప్రశ్నాపత్రంలో బాధ్యతాయుత ప్రభుత్వం, భారత ఉప రాష్ట్రపతి, మంత్రిమండలి, సంకీర్ణ ప్రభుత్వం, ద్విశాసన సభ, ఎన్నికల సంస్కరణలు, తెలుగుదేశం పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టం... అంశాలను ఇస్తూ, అందులో ఐదు ఎంచుకోవాలని కోరింది. ఇచ్చిన 8 అంశాలలో ఏడు అంశాలు అభ్యంతరకరంగా లేకున్నా, తెలుగుదేశం పార్టీ గురించి రాయడం మాత్రం పూర్తిగా అభ్యంతరకరంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలా ఓ పార్టీ గురించి రాయాలనడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని భావిస్తున్న వారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలేజీ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రశ్నాపత్రాన్ని తాము తయారు చేయలేదని, మరో వర్శిటీ నుంచి వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ప్రశ్నాపత్రం
సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ప్రశ్నా పత్రంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు సైతం టిడిపి ట్రాప్ లో వేసేందుకు ఈ తరహా ప్రశ్నపత్రాలను ఇస్తున్నట్లుగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నారు.