అనంతలో వరదలు: వాగులో కొట్టుకుపోయిన కారు: అందులో ఇద్దరు: ఆర్టీసీ బస్సును ఫాలో
గుత్తి: ఏడాది పొడవునా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది కూడా కరవు తీరా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా వరుణుడు అనంతపురం జిల్లాను కరుణించాడు. ఈ సారి వర్షాకాలం ఆరంభంలోనే అనంతపురం జిల్లాలో వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడూ నిండని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లలో వరదనీరు చేరుతోంది.
ఏపీ సర్కార్.. వాట్ నెక్స్ట్: కేంద్రం ఝలక్: ఆ పథకానికి బ్రేక్ పడినట్టేనా?: జగన్ స్పందనేంటీ?
పొంగిపొర్లుతోన్న వాగులను దాటే క్రమంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డును దాటే క్రమంలో ఓ కారు వాగులో కొట్టుకునిపోయింది. అదృష్టవశావత్తూ కారు నీటిలో మునగి పోలేదు. లోతు తక్కువగా ఉండటంతో తేలుకుంటూ కొంతదూరం వెళ్లింది. దీనితో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడగలిగారు. గ్రామస్తులు వారిని సకాలంలో రక్షించగలిగారు.
గుత్తి సమీపంలోని రాజాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్, యూసుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటకలోని బళ్లారి నుంచి కడపకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో వారు రాజాపురం వద్ద వరదనీటితో ప్రవహిస్తోన్న రోడ్డును దాటడానికి ప్రయత్నించారు. వారి ముందే ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో దిగింది. దీనితో వారు తమ కారును కూడా బస్సును అనుసరించారు. బస్సు బరువు అధికంగా ఉండటం వల్ల సురక్షితంగా ప్రవాహాన్ని దాటుకుంది. కారు మాత్రం మధ్యలోనే ఆగిపోయింది.
Recommended Video
ప్రవాహ ఉధృతికి రోడ్డు పక్కకు కొట్టుకునిపోయింది. లోతు తక్కువగా ఉండటం వల్ల కారు మునిగిపోలేదు. అయినప్పటికీ..ప్రవాహానికి పడవలా కొట్టుకెళ్లింది. కారులో ఉన్న రాకేష్, యూసుఫ్లను స్థానికులు రక్షించారు. తాళ్ల సహాయంతో వారిని బయటికి లాగారు. కారు మాత్రం ప్రవాహానికి కొట్టుకెళ్లింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బళ్లారి నుంచి కడపకు వెళ్తున్నట్లు వారు రాకేష్ తెలిపారు.