మనసున్న మారాజు ఈ కలెక్టర్: హాస్టల్ పిల్లలకు చెప్పులు కొనిచ్చిన సత్యనారాయణ
ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తారనే విమర్శలు బాగా ఉన్నాయి. ఏదో ఆఫీసుకు వచ్చామా, పని చూసుకున్నామా ఇంటికెళ్లామా అన్నట్లుగా ఉంటారనే విమర్శ ఉంది. విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసిన ఘటనలు కూడా చూశాం. కొందరు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి విమర్శల పాలవుతుంటే మరి కొందరు మాత్రం సొంత పనిలా భావించి విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఓ కలెక్టర్ మానవత్వాన్ని చాటుకుని అందరి మన్ననలు పొందారు.
Recommended Video
కరువు జిల్లా అనంతపురంకు కలెక్టర్గా ఉన్న సత్యనారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పీకే చెరువు గ్రామంలోని బీసీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చెప్పులు లేకపోవడంతో చూసి కలెక్టర్ సత్యనారాయణ చలించిపోయారు. ఆ విద్యార్థులందరికీ తన సొంత ఖర్చులతో చెప్పులు కొనిచ్చారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఆయన చెప్పులు కొనిచ్చారు. ఇందుకోసం సొంత డబ్బులు రూ.10వేలు వెచ్చించారు.
అంతకుముందు అదే అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ప్రభుత్వ పాఠశాలలో మూత్ర విసర్జనకు అని ఓ విద్యార్థి చెప్పులు లేకుండా వెళ్లడంతో పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తే చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతోనే వెళుతున్నారు. ఏమైనా విషపురుగులు కరిచే అవకాశం ఉంది. ఇది గ్రహించిన కలెక్టర్ సత్యనారాయణ పిల్లలందరికీ చెప్పులు కొని ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్లు ఒక రోజు నిద్రించాలని అక్కడి సమస్యలను తెలుసుకోవాలంటూ సీఎం జగన్ తొలి కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఏ పాఠశాలకు వెళుతున్నామో ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఒకరోజు విద్యార్థుల హాస్టల్లోనే నిద్రించాలంటూ కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వెళ్లిన అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థుల కాళ్లకు చెప్పులు లేకుండా ఉండటం చూసి చలించి సహాయం చేశారు.