గంధం చంద్రుడు మళ్లీ మెరిశాడు -దేశంలోనే టాప్లో అనంతపురం జిల్లా -ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డు
విధి నిర్వహణలో భాగంగా జిల్లాలకు ఎంతో మంది కలెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు.. కానీ అతికొద్ది మంది మాత్రమే సిసలైన అధికారులుగా గుర్తింపు పొందుతారు.. తమ అధికార పరిధిలోనే సమాజంలోని అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం తపించే ఆఫీసర్లనైతే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. అలాంటి వాళ్లలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒకరు. ఆయన సారధిగా ఉన్న అనంతపురం జిల్లా.. ప్రత్యేక అంశంలో దేశంలోనే టాప్ ర్యాంకులో నిలిచింది..
పరిపాలనా పద్ధతులకు వినూత్నతను జోడిస్తూ, ప్రజలందరినీ భాగస్వాములుగా చేస్తూ అనంతపురం జిల్లాను ముందుకు నడిపిస్తోన్న తీరుకుగానూ కలెక్టర్ గంధం చంద్రుడుకు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా కీలకమైన వ్యవసాయ రంగంలోనూ కేంద్ర సర్కారు అందించే ప్రతిష్టాత్మక అవార్డు అనంతపురం జిల్లాకు దక్కింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో అనంతపురం జిల్లా మరోసారి సత్తా చాటింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పీఎం కిసాన్ జాతీయ అవార్డును అందుకున్నారు. పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో అనంతపురం జిల్లాను ఈ అవార్డు వరించింది.
అనంతపురం జిల్లాకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరి ఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఏకంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది.
జిల్లాకు పీఎం కిసాన్ అవార్డు దక్కడంపై కలెక్టర్ గంధం చంద్రుడు హర్షం వ్యక్తం చేశారు. తద్వారా అనంతపురం రైతులను ఆదుకోవడం కోసం జిల్లా యంత్రాంగం చేస్తోన్న విశేష కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ అవార్డును పొందిన అనంతపురం జిల్లా కలెక్టర్ కు అభినందలను వెల్లువెత్తుతున్నాయి.