గజదొంగలా రాత్రి వచ్చి.. సాయిరెడ్డిపై జేసీ పవన్ రెడ్డి చిందులు
ఏపీ సర్కార్పై టీడీపీ యువనేత జేసీ పవన్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రావణ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతల అరెస్ట్ ఏంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అదుపులోకి తీసుకుంటారా అని అడిగారు. ఏదైనా జరిగితే అడగడమే నేరమా అని నిలదీశారు. దొంగల్లా రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
గజదొంగలా..
గజదొంగ లాగా రాత్రి సమయంలో ఇంటికి వెళ్లి కళా వెంకట్రావును అరెస్ట్ చేయడం ఏంటీ అని పవన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ఏమాత్రం ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారా అని అడిగారు. సౌమ్యుడు అయిన కళా వెంకట్రావు మీకు కనిపించలేదా అని కొశ్చన్ చేశారు. ఆదేశాలు రావడంతో కేసు పెడుతారా అని విరుచుకుపడ్డారు. సీఎం జగన్ జైలుకు వెళ్లి వచ్చినందున.. తెలుగుదేశం నేతలను జైలుకు పంపుతున్నారా అని ప్రశ్నిచారు.
బీసీలకు తప్పని వేధింపులు..
బీసీల పేరు చెప్పుకుని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇకనైనా బీసీలపై కక్ష సాధింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి రంగంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని.. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు. రాష్ట్రంలో 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాజ్యం కావాలా అని అడిగారు. అలా అయితే చెప్పండి తాము తప్పుకుంటామని పవన్ కుమార్ రెడ్డి చురకలు వేశారు.
అసభ్యపదజాలం..
ఇక వైసీపీ మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారికి దూషించడం తప్ప వేరే పని లేదని పవన్ రెడ్డి అన్నారు. మాజీమంత్రి దేవినేని ఉమను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పాలన ప్రజా వేదిక విధ్వంసం చేయడంతో ప్రారంభించాట్టారని విమర్శించారు. ఎన్నికలకు సంబంధించి/ ఇతర అంశాలు కోర్టు తీర్పుతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని అడిగారు.
జగన్కు భయం..
ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంటే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. స్ధానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కానీ ఎన్నికలకు సీఎం జగన్ భయపడుతున్నారని పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు.