బీజేపీలో టీడీపీ విలీనం ఖాయం: చంద్రబాబు సిద్దంగానే ఉన్నారు: జేసీ సంచలన వ్యాఖ్యలు..!
బీజేపీలో వీలీనం అయ్యేందుకు టీడీపీ సిద్దంగా ఉందా. ఇందు కోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా. అవుననే అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏపీ అభివృద్దికి రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు సలహాలు అవసరమని..అదే విధంగా ఏపీకి మోదీ అవసరం అంటూ జేసీ చెప్పుకొచ్చారు. బీజేపీలో విలీనానికి టీడీపీ నేతలు సైతం సిద్దమేనని వివరించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని గుర్తు చేసారు. త్వరలోనే రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయనే విధంగా ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీతో టీడీపీ విలీనం ఖాయమా..
నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే జేసీ బ్రదర్స్లో ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రానున్న రోజుల్లో బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని బాంబు పేల్చారు. ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు సలహాలు అవసరం అని..అదే విధంగా దేశానికి మోదీ అవసరమని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ది జరగాలంటే ఈ ఇద్దరు నేత లు కలిస్తేనే సాధ్యమని వివరించారు. ఇందు కోసం రెండు పార్టీల నేతలు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఇవన్నీ సంచలనం కోసం చెప్పటం లేదని..స్పష్టమైన సమాచారంతోనే చెబుతున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు..అదే విధంగా శాశ్వత శత్రువులు ఉండరని వ్యాఖ్యానించారు. ఏపీలో నెలకొన్న తాజా రాజీకీ య పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలవటం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
బీజేపీతో తాళి కట్టించుకుంటాం..
గతంలో బీజేపీతో కలిసి సంసారం చేసామని..మధ్యలో విడిపోయినా..తిరిగి ఇప్పుడు బీజేపీతో తాళి కట్టించుకొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. కొద్ది రోజులుగా జేసీ బ్రదర్స్తో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లుగా ప్రచారం సాగు తోంది. జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్తో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారనే వార్తలు సైతం వచ్చాయి. జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే బీజేపీలో చేరుతున్నారని..ప్రభాకర్ రెడ్డి చేరటం లేదని ఆ తరువాత జేసీ వర్గీయులు చెప్పుకొచ్చారు. వారం రోజుల వ్యవధిలో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును రెండు సార్లు కలిసారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వారు మిగిలిన ముఖ్యమైన నేతలను బీజేపీ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రాంతాల వారీగా ప్రభావం చూపగలిగిన నేతలను వ్యూహా త్మకంగా ఎంచుకుంటున్నారు.
జేసీ చెప్పింది జరుగుతుందా..
ఇప్పుడు అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన విధంగా జరిగే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. కోస్తాలో కాపు వర్గా నికి చెందిన వారిని..రాయలసీమలో రెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలకు బీజేపీ ట్రాప్ చేస్తోంది. మొన్నటి వరకూ బీజేపీ మీద..ప్రధాని మీద విమర్శలు చేసిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు అనుకూలంగా మాట్లాడమే వారి సానుకూలంగా ఉన్నారటానికి సంకేతాలుగా చెబుతున్నారు. ఇప్పుడు వరుస పెట్టి టీడీపీ నేతలు బీజేపీ బాట పడుతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి సంబంధించి అంత సులువుగా కనిపించక పోయినా.. పార్టీలో మాత్రం దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.