దారుణం : పట్టించుకున్నోడే లేడు.. ఆమె కళ్లెదుటే భర్త మృతి..
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. శ్వాసకోశ సమస్యతో వచ్చిన ఓ పేషెంట్ను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో అతని భార్య రాత్రంతా సిబ్బంది చుట్టూ తిరుగుతూ వార్డులో చేర్చుకోవాలని బతిమాలింది. అయినప్పటికీ సిబ్బంది కనికరించకపోవడంతో తెల్లవారుజామున అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన రాజా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. గురువారం(జూలై 23) సమస్య తీవ్రమవడంతో అతని భార్య,కుమార్తె అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రి వార్డులో చేర్చుకునేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో ఆస్పత్రి ఆవరణలో రోడ్డు పైనే కూర్చుండిపోయారు.
రాత్రంతా అతని భార్య సిబ్బంది చుట్టూ తిరుగుతూ వార్డులో చేర్చుకోవాలని బతిమాలింది. కానీ సిబ్బంది కనికరించలేదు. ఓవైపు భర్త అనారోగ్య సమస్య,మరోవైపు కనికరం లేని సిబ్బంది కారణంగా నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోయింది. రాజా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తెల్లవారుజామున ఆస్పత్రి ఆవరణలోని ఓ చెట్టు కింద ప్రాణాలు విడిచాడు.సకాలంలో తన భర్తకు వైద్యం అందించి ఉంటే బతికేవాడని... సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య ఆరోపించారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. 'అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ముఖ్యమంత్రి జగన్ అసమర్థ ప్రభుత్వ పనితీరుకి ఉదాహరణ.' అని విమర్శించారు. 'అనారోగ్యానికి గురైన ధర్మవరంకి చెందిన రాజుని కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు.
8 గంటల పాటు ప్రాణాలు పోతున్నాయి, కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించలేదు. వైద్యం అందక అతను చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు.' అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. జగన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నాయని... ఇకనైనా సీఎం మొద్దునిద్ర వీడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.