టీడిపి కార్యక్తల జోలికొస్తే సహించేది లేదు..! అనంతపురంలో బాబు హెచ్చరికలు..!!
Recommended Video
అనంతపురం/హైదరాబాద్: ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా బాట పట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన టీడిపి కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 'కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆస్తుల ధ్వంసం..చెట్లకు చెప్పులు: అనంతలో రాజకీయ వేధింపులు: టీడీపీ శ్రేణులే లక్ష్యంగా...!
ప్రజాబాట పట్టిన చంద్రబాబు..! అనంతపురంలో పర్యటన..!!
అంతే కాకుండా అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటామని, తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదని, ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పైనా దాడి చేశారని, ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పైనా దౌర్జన్యానికి పాల్పడ్డారని విచారాన్ని వ్యక్తంచేశారు. తాడిపత్రి నుంచి చంద్రబాబు బత్తలపల్లికి వెళ్లారు. మే 31న హత్యకు గురైన టీడీపి కార్యకర్త గుల్ల రాజు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు.
గెలుపోటములు సర్వసాధారణం..! బాదపడాల్సిన పని లేదన్న బాబు..!!
అంతకుముందు కడప విమానాశ్రయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడిపి కి సహకరించిన ప్రజలపై కూడా వైయస్ఆర్ సీపి దాడులు చేస్తోందన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపైనా దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవు పలికారు.
చంద్రబాబు భద్రత కుదింపుపై పిటీషన్..! విచారణ వాయిదా వేసిన కోర్ట్..!!
టీడిపి అధినేత చంద్రబాబు భద్రత కుదింపునకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. భద్రత కుదింపును పునఃసమీక్షించాలని కోరుతూ చంద్రబాబు హై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారి సీఎస్ఓలుగా ఉండేవారు. వారితో పాటు ముగ్గురు ఆర్ఐలు.. వీరి పరిధిలో ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్ల చొప్పున కొనసాగేవారు. ఇప్పుడు మాత్రం ఒక డీఎస్పీతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రతా సిబ్బందిగా ప్రభుత్వం కేటాయించింది.
అట్టహాసంగా హారతి..! లోకేష్ తో టీడిపి ముఖ్య నేతలు..!!
కృష్ణా జిల్లాలో టీడిపి ఆధ్వర్యాన గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. హనుమాన్జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి నీటికి టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హారతిచ్చారు. గత మూడేళ్లుగా టీడిపి ప్రభుత్వం 'జలసిరికి హారతి' కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలో లేనందున పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, జవహర్, వంశీ, బచ్చుల అర్జునుడు, కొనకళ్ల తదితరులు పాల్గొన్నారు.