విశాఖ అమ్మాయి మృతిపై డౌట్స్: ప్రేమ వ్యవహారమా, ఏం జరిగింది?
విశాఖ: కృష్ణరాయపట్నంలో శనివారం నాడు కనిపించకుండా పోయి, ఆదివారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించిన ఎనిమిదో తరగతి విద్యార్థిని తనూజ మృతి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి కనిపించకుండా పోయి, తెల్లారికల్లా ఆమె శవమై కనిపించింది.
ఓ సంఘటన విషయమై శనివారం రాత్రి ఆ అమ్మాయిని తల్లి మందలించింది. దీంతో బాలిక ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయింది. అనంతరం తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెదికినా ఆమె జాడ కనిపించలేదు. చివరకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం అపార్టుమెంట్ వాచ్మెన్ కొడుకు ఆమె మృతదేహం కనిపించినట్లు చెప్పాడు. తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అక్కడకు చేరుకున్నారు. తమ కూతురు మృతికి ఓ విద్యార్థి కారణమని వారు ఆరోపించారు. తల్లి కన్నీరుమున్నీరు అయింది.
8వ తరగతి అమ్మాయి రేప్, హత్య: ఒంటిపై దుస్తులు లేకుండానే పడేశారు
ప్రేమ వ్యవహారమా?
ప్రేమ వ్యవహారం కారణంగా బాలిక మనస్తాపానికి గురయిందా? ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. అదే సమయంలో అలిగి రాత్రివేళ బయటకు వచ్చిన ఆమెను మద్యం తాగిన వ్యక్తులు అఘాయిత్యం చేసి చంపేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఆ అమ్మాయి పాఠశాల నుంచి వస్తుండగా ఓ విద్యార్థి ఆమె చేయి పట్టుకున్నాడన్న విషయం తెలియడంతో, శనివారం రాత్రి అతను ఆమెను ఏమైనా చేసి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఏమైనా చెబుతామని పోలీసులు అంటున్నారు.
అమ్మాయి మరణవార్త తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓ దశలో వారిని అదుపు చేయడం కష్టమైంది. అమ్మాయి మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
రెండు రోజుల క్రితం చెల్లెలిని ఓ విద్యార్థి వేధించాడని చనిపోయిన అమ్మాయి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకీ తీసుకొని విచారిస్తున్నారు. ఆమెతో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆమెను వేధించలేదని కీలక అనుమానితుడు చెబుతున్నారు. శనివారం రాత్రి తనను అసలు కలువలేదని, మృతితో సంబంధం లేదని చెప్పారని తెలుస్తోంది. అతని పేరు దిలీప్గా తెలుస్తోంది.