వెయ్యిమంది చంద్రబాబులొచ్చినా మోడీని ఎదుర్కోలేరు: సౌందరరాజన్
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా ఢీకొట్టలేని రాజకీయ పార్టీ నేతలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ అన్నారు. నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే, రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం మంచి పరిణామమని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ-చంద్రబాబు ఒక్కతాటిపైకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో వారిద్దరిపై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెయ్యిమంది చంద్రబాబులు, స్టాలిన్లు కలిసి వచ్చినా నరేంద్ర మోడీని ఎదుర్కోలేరని స్పష్టం చేశారు. ఆరోగ్యం, ఆర్థిక రంగాలతోపాటు అన్ని రంగాల్లోనూ భారతదేశాన్ని మోడీ ఉన్నతస్థాయికి తీసుకెళుతున్నారని చెప్పారు.
'మోడీ గొప్ప నాయకుడు. ఎంతమంది శత్రువులు ఏకమైన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మోడీ విజయాన్ని అడ్డుకోలేరు. ప్రజలకు ఆయనపై ఎంతో నమ్మకం ఉంది' అని సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. దీపావళి రోజున టపాసులను కాల్చడం అనేది సంప్రదాయంగా వస్తోందని, బాణాసంచా కాల్చకుండా దీపావళి జరుపుకోవడం కుదరని అన్నారు.