ఏపీలో కోరలు చాస్తున్న కరోనా: భారీగా కొత్త కేసులు, లక్షకుపైగా యాక్టివ్ కేసులు, 2వ స్థానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా ఆరో రోజు కూడా 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలోకి చేరింది.
10వేలకు తగ్గకుండా కొత్త కేసులు.. 84 మంది మృతి
గత 24 గంటల్లో 56,490 నమూనాలను పరీక్షించగా.. 10,004 మందికి కరోనా సోకినట్లు నిర్ణారణ అయ్యింది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 84 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3969కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
నెల్లూరు జిల్లాలో అత్యధిక మరణాలు
నెల్లూరు జిల్లాలో 12 మంది, చిత్తూరులో 9, ప్రకాశం 9, కడప 8, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కర్నూలు, విశాఖపట్నంలో జిల్లాల్లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళ:లో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 8772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 37,22,912 నమూనాలను పరీక్షించారు.
తూర్పుగోదావరిలో అత్యధిక కరోనా కేసులు
జిల్లాలో వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 973, చిత్తూరులో 936, తూర్పుగోదావరిలో అత్యధికంగా 1383, గుంటూరులో 498, కడపలో 420, కృష్ణాలో 159, కర్నూలులో 686, నెల్లూరులో 1086, ప్రకాశంలో 524, శ్రీకాకుళంలో 1023, విశాఖపట్నంలో 634, విజయనగరంలో 540, పశ్చిమగోదావరిలో 1142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు.. మహారాష్ట్ర తర్వాత
ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,34,771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,30,526 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3969 మంది మరణించారు. కాగా కరోనా యాక్టివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,276 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. యాక్టివ్ కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర(1,94,056) ఉంది. ఆ తర్వాత ఏపీనే ఉండటం గమనార్హం.