ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా ఉధృతి: నాలుగున్నర లక్షలకు చేరువలో కేసులు, 4వేల మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు కూడా రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video
తాజాగా 10వేలు దాటిన కేసులు.. నాలుగున్నర లక్షలకు చేరువలో
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 59,834 నమూనాలను పరీక్షించగా 10,368 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రం ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,139కి చేరింది. మరో వైపు గత 24గంటల్లో 84 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4053కు చేరింది.
చిత్తూరులో అత్యధిక మరణాలు..
జిల్లాల వారీగా మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.. చిత్తూరులో 14 మంది, పశ్చిమగోదావరిలో 11, తూర్పుగోదావరిలో 10, అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, నెల్లూరులో 6, కడపలో 5, కృష్ణాలో 4, కర్నూలులో 4, శ్రీకాకుళంలో 4, ప్రకాశంలో 3, విజయనగరం జిల్లాలో ఇద్దరు కరోనాతో మరణించారు.
కోలుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోంది..
కాగా, గత 24 గంటల్లో కరోనా నుంచి 9350 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,82,746 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,45,139 ఉండగా, 1,01,210 యాక్టివ్ కేసులున్నాయి. 3,39,876 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,053 మంది ఇప్పటి వరకు మరణించారు.
రెండో స్థానంలో ఏపీ.. దేశంలో 37లక్షలకుపైగా కేసులు
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 37,33,936 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,94,711 యాక్టివ్ కేసులున్నాయి. 28,72,714 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 65,922 మంది మరణించారు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవడంతోనే దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న విషయం గమనార్హం.