ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, కృష్టాలో స్వల్పం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏపీనే నిలుస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా ఏపీలోని కొత్త కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి.
ఏపీలో 10వేలు దాటిన కరోనా కొత్త కేసులు
గడిచిన 24 గంటల్లో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డుస్థాయిలో 10,830 మందికి కరోనా సోకినట్లు తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్లో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 34,18,690 నమూనాలను పరీక్షించగా.. 3,82,469 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
తూర్పుగోదావరిలో అత్యధికం.. 81 మంది మృతి..
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1528 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 8473 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3541కి చేరింది.
జిల్లాల వారీగా కరోనా మరణాలు..
తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది మరణించగా, ప్రకాశంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమగోదావరి ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించినట్లు వైద్యశాఖ తెలిపింది.
Recommended Video
జిల్లాలవారీగా కొత్త కేసులు.. మహారాష్ట్ర తర్వాత ఏపీనే
కొత్తగా నమోదైన కేసుల్లు జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 728, చిత్తూరులో 913, తూర్పుగోదావరిలో 1528, గుంటూరులో 532, కడపలో 728, కృష్ణాలో 299, కర్నూలులో 745, నెల్లూరులో 1168, ప్రకాశంలో 786, శ్రీకాకుళంలో 618, విశాఖపట్నంలో 1156, విజయనగరంలో 564, పశ్చిమగోదావరిలో 1065 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇప్పటి వరకు 53,567 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిఇలావుంటే, దేశంలో మహారాష్ట్ర(1,65,921) తర్వాత అత్యధిక కరోనా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం ఏపీ(92,208)నే కావడం గమనార్హం.