తూర్పు గోదావరి జిల్లాలో కర్రలతో కొట్టుకున్న టీడీపీ , వైసీపీ శ్రేణులు...10 మందికి గాయాలు
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలు చిచ్చు పెట్టాయి. పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. కక్షలు, కార్పన్యాలతో ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే టీడీపీ శ్రేణుల మీదే వైసీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇలా దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ తేల్చి చెప్తోంది.
విద్యుత్ ఒప్పందాలపై విచారణకే మొగ్గు చూపుతున్న జగన్ .. టీడీపీకి షాక్ .. కేంద్రానికి ఝలక్
వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ .. 10 మందికి గాయాలు
ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా బి. కొత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలు సద్దుమణగక పోవటంతో వారు ఎదురెదురు కాగా ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో కొంతమందికి తలపై బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో డీఎస్పీ రవివర్మ అక్కడకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు .
బి . కొత్తూరు గ్రామంలో ఎన్నికల సమయంలో ఘర్షణ .. ఆ కక్షలే దాడికి కారణం
బి. కొత్తూరు గ్రామం సమస్యాత్మక గ్రామం . ఇక ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలింగ్ రోజున చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. ఇరువర్గాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు
అయితే ఈ ఘర్షణపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో సెక్షన్ 341, 324 ( ఆయుధాలతో కావాలని దాడి చేయటం ) , హత్యా యత్న నేరం సెక్షన్ 307, RWసెక్షన్ 34 ( అనేక మంది వ్యక్తులు కలిసి నేర చట్టం) ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం ప్రత్యర్థి వర్గంలోని ఎనిమిది సభ్యులకు వ్యతిరేకంగా మొదటి కేసు నమోదైంది. రెండవ కేసులో ఐపిసి సెక్షన్ 19 క్రింద 20 మందిపై కేసు నమోదు అయ్యింది . 99 సెక్షన్ , సెక్షన్ 307 కింద కేసు దాఖలు చేశారు. ఇక కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది.