గోదావరిలో నాటు పడవ బోల్తా: ఆరుగురు విద్యార్థినుల గల్లంతు, పిల్లర్కు ఢీకొనడంతోనే
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలోని ఆరుగురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిసింది.
తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు 31మందితో బయల్దేరిన నాటు పడవ.. పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్కు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కొట్టుకుపోతున్న 25మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు విస్తృత గాలింపు చేపట్టారు. కాగా, గల్లంతైన వారిలో రమ్య, మనీష, సుచిత్ర, శ్రీజ, ప్రియ, అనూష ఉన్నారు. వీరంతా పాఠశాల విద్యార్థులే.
ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అందరూ క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నారు.