భీమవరంలో వంద పడకల ఆసుపత్రి: రెండెకరాల స్థలాన్ని విరాళం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వంద పడకల సామర్థ్యంతో ప్రభుత్వ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. దీనికి అవసరమైన అనుమతులను ఇదివరకే ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పూర్తి చేసింది. భీమవరం నగర శివార్లలో దీన్ని నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు ఆరంభించింది. ఇందులో భాగంగా తుది దశ అనుమతుల కోసం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెడికల్ కౌన్సిల్ కు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించింది.
మెడికల్ కౌన్సిల్ నుంచి తుదిదశ అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులు ఆరంభం అవుతాయని తెలుస్తోంది. తన నియోజకవర్గంలో రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు గ్రంథి శ్రీనివాస్ రెండెకరాల సొంత స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్.. తన సమీప ప్రత్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కల్యాణ్ పై సుమారు ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
వంద పడకల ఆసుపత్రిని భీమవరంలో నిర్మించడానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆళ్ల నాని తన సొంత జిల్లాలోనే ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పావులు కదిపినట్లు చెబుతున్నారు. రెండు జిల్లాలకు ఒకటి చొప్పున ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ పరిస్థితులు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోన్న వంద పడకల ఆసుపత్రిని భీమవరంలో నిర్మించడం వల్ల అన్ని విధాలుగా వెసలుబాటు ఉంటుందని ఆళ్ల నాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి- భీమవరంలో ఈ ఆసుపత్రిని నిర్మించడం వల్ల రాజకీయంగా బలపడే అవకాశం ఉంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం అటు కృష్ణా జిల్లాను సైతం ఆనుకుని ఉన్నందున.. వ్యూహాత్మకంగా ఈ పట్టణాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.