నది మధ్యలో నిండు గర్భిణీ ప్రసవం..తల్లీ ,బిడ్డను కాపాడిన 108 టీమ్..ఏం చేశారంటే
నాగావళి నది మధ్యలో నిండు గర్భిణీ ప్రసవ వేదన అనుభవించి పండంటి పాపకు జన్మనిచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నాగావళి నదికి మరో వైపు ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉన్న వనదార గ్రామానికి చెందిన జయమ్మకు పురిటి నొప్పులు రావడంతో కొమరాడ మండలానికి సంబంధించిన 108 సిబ్బందికి సమాచారం అందించారు. జయమ్మ ను ఆసుపత్రికి తరలించడానికి మధ్యలో నాగావళి నది అడ్డుగా ఉండడంతో ఆమెను 108 వాహన సిబ్బంది చేరుకోవడం కష్టమైంది. సిబ్బంది ప్రాణాలకు తెగించి జయమ్మను భుజాలపై మోసుకుంటూ నదిని దాటారు.
నాగావళి నది మధ్యలోనే జయమ్మ పండంటి ఆడబిడ్డకు జననం
వత్తాడ వద్ద వాహనాన్ని నిలిపి అవతలి వైపు ఉన్న గర్భిణీ మహిళ జయమ్మను ఆమె బంధువులు ఇవతలివైపుకు తీసుకువస్తే ఆమెను ఆస్పత్రికి తరలించాలని వారు ఎదురుచూస్తున్నారు . ఆమెను నాగావళి నదిని దాటించడానికి మొదట ఆమె బంధువులు ప్రయత్నం చేశారు. అయితే వారు నదిని దాటి లోపే నాగావళి నది మధ్యలోనే జయమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొమరాడ మండలం లోని చోళ పదం పంచాయతీ వనదార గ్రామానికి చెందిన జయమ్మ మూడో కాన్పు కోసం పురిటి నొప్పులతో బాధపడుతున్న క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఉదయం ఐదున్నర గంటలకు 108 సిబ్బందికి సమాచారం అందించారు.
వత్తాడ వద్ద 108 వాహనాన్ని నిలిపేసి సాహసం చేసిన వాహన సిబ్బంది
నాగావళి ఒడ్డున జయమ్మ ను తీసుకు వెళ్లడం కోసం వత్తాడ వద్ద వాహనం నిలిపిన 108 సిబ్బంది వద్దకు ఆమె బంధువులు జయమ్మను తీసుకు వస్తున్న సమయంలోనే ఆమె డెలివరీ అయింది. 108 సిబ్బందికి, గర్భిణీ బంధువులకు మధ్య మొబైల్ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో మొదటి ఇబ్బంది పడిన వారు, తరువాత మార్గ మధ్యలో నదిలోనే ఆమె డెలివరీ అయింది అని తెలిసి ప్రసవానికి సంబంధించిన కిట్ తీసుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలోకి నడుచుకుంటూ వెళ్లి ఆమెకు ప్రథమ చికిత్స చేసి స్కూప్ స్టెచర్ ద్వారా తీసుకువచ్చారు .
నది మధ్యలోకి వెళ్లి చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్చిన 108 సిబ్బంది
108 సిబ్బంది తమ వాహనం ద్వారా కేనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లి బిడ్డలను అడ్మిట్ చేశారు. అక్కడి వైద్యులు వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రాణాలకు తెగించి నదిలో సైతం విధులు నిర్వర్తించిన 108 సిబ్బందికి గర్భిణీ మహిళ తరపు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.రహదారి సౌకర్యం లేక నాగావళి నది దాటి 108 వాహనం వచ్చే అవకాశాలు లేక నాగావళి నదీ మధ్యలోనే ప్రసవించిన ఘటన పాలకుల పట్టింపులేని తనానికి అద్దం పడుతుంది.
రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు .. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.. 108 సిబ్బందికి హ్యాట్సాఫ్
అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్తున్న నేటి రోజుల్లో, ఇప్పటికీ చాలా గ్రామాలకు రోడ్డు మార్గం లేదు అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రాణాలకు తెగించి కాపాడిన 108 సిబ్బందిని మెచ్చుకుంటున్న వారంతా, ప్రభుత్వ ఇప్పటికైనా ఇలాంటి గ్రామాలకు రోడ్డు సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. సకాలంలో స్పందించి, రిస్క్ అయినప్పటికీ సిబ్బంది విధులు నిర్వర్తించడం వల్లే తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇప్పటికైనా పాలకులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు రవాణా సదుపాయాలను కల్పించాలని ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.