పేపర్ లీకేజీపై మంత్రులు చెరోలా..: అసెంబ్లీలో బయటపెట్టిన జగన్!
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులు మంగళవారం నాడు భిన్నమైన ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజీ అన్నదే లేదని నారాయణ చెప్పగా, నెల్లూరులో పేపర్ లీకేజీ
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులు మంగళవారం నాడు భిన్నమైన ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజీ అన్నదే లేదని నారాయణ చెప్పగా, నెల్లూరులో పేపర్ లీకేజీ వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా చెప్పారు.
గంటా శ్రీనివాస రావు ఇలా..
నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని గంటా అంగీకరించారు. విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా చెప్పారు.
నారాయణ ఇలా..
నారాయణ మాత్రం మరో రకంగా స్పందించారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని అన్నారు. జంబ్లింగ్ విధానంతో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్లకు వెళ్తారని చెప్పారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు.
నారాయణ హైస్కూల్ నుంచి లీకేజీ
అయితే, వైసిపి మాత్రం మరోలా చెబుతోంది. ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజీ జరిగినట్లు వెల్లడి అయిందని అంటోంది. నెం.4238 సెంటర్ అంటూ పక్కాగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను జగన్ అసెంబ్లీలో చెప్పారు.
అధికార పార్టీకి చిక్కులు
డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక తన వద్ద ఉందని, దానిని సభలో బయట పెట్టిన జగన్... దాని గురించి మాట్లాడేందుకు రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని చెప్పారు. తన వద్ద రిపోర్ట్ ఉందని చెప్పారు. మొత్తానికి పేపర్ లీకేజీ వ్యవహారం అధికార పార్టీకి చిక్కులు తెచ్చినట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు ఆగ్రహం
మరోవైపు, పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ అంశంపై మండిపడ్డారు. లీకేజీ వ్యవహారంపై అధికారులు చంద్రబాబుకు వివరణ ఇచ్చారు.