సభా పర్వం: ఏపీ అసెంబ్లీలో నేడు 11 కీలక బిల్లులు..అన్నీ కీలక నిర్ణయాలే !!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ పక్క మాటల యుద్ధం కొనసాగుతున్నా , అధికార పార్టీ పలు కీలక చట్టాలను తీసుకువస్తూ తనదైన దూకుడు చూపిస్తూ ముందుకు సాగుతుంది. ఇక నేడు అసెంబ్లీలో 11 అంశాలకు సంబంధించి పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ప్రభుత్వం కీలక చట్టాలను, చట్ట సవరణలను చేయనుంది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలో విలీనంపై కీలక బిల్లు
ముఖ్యంగా అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై నేడు సభలో చర్చించి ఆమోదించనున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం కొత్త చట్టం చేయనున్నారు. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టూ గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్ 2019 బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.
ఆర్టీసీ విషయంలో చారిత్రక చట్టం చెయ్యనున్న ఏపీ ప్రభుత్వం
ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి, ప్రభుత్వ శాఖ కిందకు తీసుకురావడానికి చారిత్రక చట్టం చేయాలని నిర్ణయించు కుంది ఏపీ సర్కార్. ఈ చట్టం ద్వారా 52 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ఏపీలో అధికార పార్టీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే చట్టం సభలో ప్రవేశపెట్టనుంది.
రైతులకు మేలు చేకూర్చే చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల బోర్డుల ఏర్పాటు
చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రత్యేకంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం లక్ష్యంగా చిరు, పప్పుధాన్యాల బోర్డులను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ బోర్డులు స్వయంప్రతిపత్తిని పనిచేసి రైతులకు మెరుగైన ధరల కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తాయి.
అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై ఇకపై ఉక్కుపాదమే
ఇక అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూడా ఎక్సైజ్ చట్టంలో చట్ట సవరణకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వం మధ్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఎవరైనా మద్యాన్ని అక్రమంగా విక్రయించినా, రవాణా చేసిన, తయారుచేసిన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించాలి అని కనీసం ఆరు నెలల నుండి అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని భావిస్తున్నారు.
ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో సవరణ
మొదటిసారి పట్టుబడితే రెండు లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే ఐదు లక్షలు జరిమానా విధిస్తారు. ఇక బార్లలో మధ్య అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు పైన, రెండు లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక నేడు మద్యం అక్రమాలపై కఠిన చర్యలతో కూడిన ఎక్సైజ్ చట్టంలో సవరణ బిల్లును కూడా నేడు ప్రవేశపెట్టనున్నారు. ఇక అంతే కాకుండా ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎక్సైజ్ చట్టంలో సవరణ కూడా చేయనున్నారు.
నేడు అసెంబ్లీలో పలు కీలక చట్ట సవరణ బిల్లులు
ఆంధ్ర ప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టంలో సవరణ, ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిస్ చట్టంలో సవరణ, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్టంలో సవరణ, వివిధ యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీల చట్టానికి సంబంధించిన పలు కీలక సవరణలను నేడు సభలో ప్రవేశపెట్టి చట్ట సవరణలు చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
యూనివర్సిటీల ఏర్పాటుకు యూనివర్సిటీల చట్టంలో సవరణలు
వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చట్టంలో సవరణ చెయ్యటానికి నేడు సభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీని , కేవీఆర్ గవర్నమెంట్ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ చెయ్యనున్నారు.
11కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని, అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టంలో సవరణ చెయ్యనున్నారు. తద్వారా మెరుగైన విద్యాభోధనే కాదు యూనివర్సిటీల పని తీరుపై ఎప్పటికీ దృష్టి పెట్టేలా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . ఏది ఏమైనా 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టి వీటిని ఆమోదించనుంది .