నేడే అమరావతిలో ఆర్థికమంత్రుల సమావేశం: హాజరుకావడం లేదన్న ఈటెల!
అమరావతి: జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు జరపాలన్న 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నేడు 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అమరావతిలో సమావేశమవనున్నారు. నెల క్రితం కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం జరగ్గా.. సోమవారం 11రాష్ట్రాల ఆర్థికమంత్రులతో అమరావతిలో సమావేశం జరగనుంది.
సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటిదాకా రాష్ట్రాలకు జరిగిన నిధుల కేటాయింపులన్ని 1971జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే.. 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 లెక్కల్ని పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులు రానున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీకి ఏటా రూ.8వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ నిబంధనలు అమలులోకి వస్తే.. ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాలన్ని 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నిబంధనలతో నష్టపోయే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై దీనిపై చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలకు వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి తీర్మానం పంపించాలని నిర్ణయించారు. కాగా, 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో ఏపీ జనాభా 5.05శాతంగా, అదే 2011జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఏపీ జనాభా 4.09శాతంగా ఉంటుంది.
హాజరుకావడం లేదన్న ఈటెల:
నేటి ఆర్థికమంత్రుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో కేరళలో జరిగిన ఆర్థిక సంఘం సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీనిపై వివరణ అడగ్గా.. స్పందించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
విధివిధానాలు మార్చాల్సిందే: మంత్రి యనమల
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు.
విభజన అనంతరం రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని, కేంద్రం మాత్రం ఇప్పటిదాకా కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాలు 60:40నిష్పత్తిలో అమలవుతున్నాయని, దీనివల్ల రాష్ట్రాలపై 30శాతం అదనపు భారం పడుతోందని అన్నారు.