ఏపీలో కరోనా అప్డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,824కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7139కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం (జనవరి 16) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా మరో 326 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,76,698కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 25,542 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,25,40,181కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24,విశాఖపట్నంలో 22 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కడపలో 2,అనంతపురం,విజయనగరం జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,24,055 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కాగా,దేశవ్యాప్త కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఏపీలోనూ శనివారం(జనవరి 16) కరోనా టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు పుష్ప కుమారి తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆమెకు టీకా ఇవ్వగా... సీఎం కాసేపు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 332 కేంద్రాల్లో ఇవాళ టీకా పంపిణీ చేశారు.