అమరావతికి అనుసంధానంగా కృష్ణా నదిపై 12 బ్రిడ్జిలు...ఏజన్సీకి ఫైబర్ నెట్
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అనుసంధానంగా కృష్ణా నదిపై 12 వంతెనలు నిర్మించనన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఏ అథారిటీ 17వ సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది.
ఈ సమావేశంలో సిఆర్డిఏ పరిధిలో వివిధ అభిృద్ది పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠపురం రిజర్వాయర్ వద్ద వంతెన నిర్మాణాన్ని ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలని అధికారులకు సూచించారు. రాజధాని పరిధిలో చేపట్టిన రోడ్ల పనులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అందుకోసం అధునాతన పద్దతులు వినియోగించుకోవాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణం...విక్రయం
టిటిడి ఆధ్వర్యంలో అమరావతి పరిధిలో చేపట్టనున్న వెంకటేశ్వరస్వామి దేవస్థానం కోసం పవిత్ర సంగమం వద్ద స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు. అలాగే రాజధాని పరిధిలో సొంత ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికోసం 1285, 1580, 1880, 2150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చదరపు అడుగుకు రూ.3వేల చొప్పున వెచ్చించాలని పేర్కొంటూ రూ.500 కోట్ల వ్యయం అంచనా వేశారు. రాజధానిలో ఎస్ఆర్ఎం వర్సిటీకి రెండు రోజులుగా నీరందడం లేదని తెలిసి సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ నీరు నిలిచినా అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
కొండల...సుందరీకరణ
రాజధాని పరిధిలో కొండలన్నిటినీ సుందరీకరించాలని ఆదేశించారు. వివిధ రకాల పుష్పజాతులతో ఒక్కో కొండకు ఒక్కో విశిష్టత తీసుకురావాలని సూచించారు. ఇందుకు అటవీశాఖ, సిఆర్డిఏ అధికారులు సమన్వయంతో పనిచేయాల న్నారు. పర్వతారోహకులు, సాహస క్రీడా ప్రియులను ఆకట్టుకునే విధంగా ఈ అభివృద్ధి ఉండాలన్నారు. శాఖమూరులో 7.5 ఎకరాల్లో శిల్పారామం ఏర్పాటు చేయనున్న ఎత్నిక్ విలేజ్లో ఎకరం స్థలంలో క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దొనకొండలో వస్తు నిర్మాణ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు.
విశాఖలో...డిజైన్ వర్సిటీ...మెట్రో
విశాఖలో డిజైన్ యూనివర్శిటీ ఏర్పాటుకు యునెస్కో ముందుకు వచ్చింది. గేమింగ్ డిజిటల్ హబ్ ఏర్పాటుకు సంబంధించి ఈడిబితో ఒప్పందం కుదుర్చుకున్న యునెస్కో బృందం బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. విశాఖను డిజిటల్ లెర్నింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు సిఎంకు వివరించారు. ఇందుకోసం వంద ఎకరాలు కేటాయించాలని కోరారు. అలాగే విశాఖ మెట్రోను సాధ్యమైనంత త్వరగా చేపట్టి, వేగంగా పూర్తిచేసి విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సిఎం అధికారులకు సూచించారు.
ఏజెన్సీల్లో...ఫైబర్ నెట్
గిరిసేవ-గిరినెట్ కింద ఏజెన్సీ ప్రాంతాల్లో ఆగస్టు 15 కల్లా 100, అక్టోబర్కి 220 ఫైబర్ నెట్ టవర్లు ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రూ. 120 కోట్లతో 26 మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించారు. రూ. 226.24 కోట్లతో 1,005 ఎస్సీ కాలనీలకు తాగునీరు సదుపాయం, మరో రూ. 451.97 కోట్లతో 446 కాలనీలకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.