అలర్ట్: చెన్నై నుంచి శ్రీకాకుళంకు చేరిన మత్స్యకారులు, క్వారంటైన్కు తరలింపు
చెన్నై/అమరావతి: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ఓ బోటులో నాలుగు రోజుల క్రితం సముద్రంలో బయలుదేరిన 12 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. కరోనావైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న తీరం వద్ద నిఘా పెట్టిన పోలీసులు.. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో కవిటి మండలం ఇద్దివానిపాలెంకు చేరుకున్న మత్స్యకారులను అదుపులోకి తీసుకుని రాజపురంలోని క్వారంటైన్కు తరలించారు.
రొట్టెలు, బిస్కెట్లు తినే..
కరోనావైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా తీర గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. చెన్నై నుంచి వస్తున్న మత్స్యకారులపై సమాచారం ఉండటంతో అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. చెన్నై సమీపంలోని రాయపురం తీరంలో ఏప్రిల్ 14న రాత్రి బోటులో కవిటి మండలానిిక చెందిన ఏడుగురు, సోంపేట మండలానికి చెందిన ఐదుగురు బయలుదేరారు. రొట్టెలు, బిస్కెట్లు, అటుకులు వంటి నిల్వ ఉండే ఆహరంతోనే 95 గంటలు గడపడం గమనార్హం.
నిఘా వేసి క్వారంటైన్ తరలింపు..
కాగా, మత్స్యకారులు వస్తున్నారనే సమాచారం అందడంతో వారిని గ్రామాల్లో రాకుండా తీర్మానాలు చేశారు. బోటులో ఉన్న మత్స్యకారులకు కొందరి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుండటంతో వారు ఆందోళనకు గురయ్యారు. తమను గ్రామంలోకి రానివ్వరని తెలిసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఆ మత్స్యకారులు ఏ క్షణంలోనైనా తీరానికి చేరుకోవచ్చనే అంచనాతో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం తీరం వరకూ అధికారులు అప్రమత్తమయ్యారు. సోంపేట, కవిటి మండలాల్లో అధికారులు గ్రామాల్లో పెంచారు. చివరికి వారు ఇద్దవానిపాలెం సమీపించారని తెలుసుకుని, తీరానికి చేరుకున్నవారిని అప్పటికే సిద్ధంగా ఉన్న ఎస్సై వాసునారాయణ ప్రత్యేక వాహనాల్లో రాజపురం క్వారంటైన్కు వారిని తరలించారు. వారికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Recommended Video
సముద్ర తీరాలు అప్రమత్తం..
కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో సముద్ర తీర ప్రాంతంలో పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. తీరం నుంచి వచ్చే వలసదారులను గ్రామాల్లోకి రానీయకూడాదని, సమాచారం ఇవ్వాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. కాశీబుగ్గలో మెరైన్, స్థానిక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా రోడ్ మార్గాలను తనిఖీ చేస్తుండటంతో, కొందరు సముద్ర తీరం గుండా వారి స్థలాలకు చేరుకుంటుండటంతో తీరాల వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టారు.