కర్నూలును దాటేసిన గుంటూరు: ఏపీలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు: ఆ నాలుగు జిల్లాల్లోనే
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రెండుచోట్ల మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాాల్లోని తిష్టవేసకుని కూర్చున్న ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్తగా రాష్ట్రంలో మరో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం ఉదయం ఈ మేరకు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. కొత్తగా నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరింది.
Recommended Video
తాజాగా నమోదైన 12 కేసుల్లో అత్యధికం గుంటూరు జిల్లాలోనివే. ఈ ఒక్క జిల్లాలోనే ఎనిమిది పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. చిత్తూరులో రెండు కేసులు నమోదు కాగా.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరాయని, 12 మంది పేషెంట్లు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు చెప్పారు.
కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇప్పటిదాకా కర్నూలు జిల్లా టాప్ పొజీషన్లో ఉండేది. తాజాగా నమోదైన కేసుల అనంతరం కర్నూలు రెండో స్థానానికి చేరుకుంది. గుంటూరు జిల్లా దాని స్థానాన్ని ఆక్రమించింది. సోమవారం ఉదయం నాటికి గుంటూరులో మొత్తం 90 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో ఈ సంఖ్య 84. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని నోడల్ అధికారి తెలిపారు.
జిల్లాల వారీగా అనంతపురం-15, చిత్తూరు-23, తూర్పు గోదావరి-17, గుంటూరు-90, కడప-31, కృష్ణా-36, కర్నూలు-84, నెల్లూరు-52, ప్రకాశం-41, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-23 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా జిల్లాల నుంచి నలుగురు చొప్పున కరోనా వైరస్ పేషెంట్లు పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ అనుమానితుల శాంపిళ్లకు పరీక్షలు చేస్తున్నామని, వాటి నివేదికలు అందాల్సి ఉందని అన్నారు.