నారాయణరెడ్డిని చంపింది వీళ్లే!: నిజం ఒప్పేసుకోవడంతో వీడిన మిస్టరీ..
చెరుకులపాడు నారాయణరెడ్డి కొసనపల్లె గ్రామానికి వస్తారని ఒకరోజు ముందే తెలియడంతో.. తమ వర్గీయులను కూడగట్టుకుని హత్య చేసేందుకు వెళ్లామన్నారు.
కర్నూలు: జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో.. ఫ్యాక్షన్ కక్షల్లో హతమైన నారాయణరెడ్డి హత్య వెనుక మిస్టరీ వీడింది. ఈ హత్య వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని, తరాల నాటి పగకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఆయన్ను మట్టుబెట్టామని నిందితులు పోలీసులు ఎదుట అంగీకరించారు.
ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..
ఈ మేరకు జిల్లా ఎస్పీ రవికృష్ణ, డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీనతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. నారాయణ రెడ్డి హత్యలో 12మంది నిందితులను అరెస్టు చేసి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాగా, నారాయణ రెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల హస్తముందని వైసీపీ ఆరోపించడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.
పోలీసుల కథనం ప్రకారం:
చెరుకులపాడు గ్రామానికి చెందిన వైసీపీ ఇన్ చార్జీ నారాయణరెడ్డికి, అదే గ్రామానికి చెందిన బీసన్నగారి రామాంజనేయులు, కోతుల రామాంజనేయులు కుటుంబాల మధ్య దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కక్షలు ఉన్నాయి. బీసన్నగారి కుటుంబానికి చెందిన పెద్దబీసన్న, చిన్నబీసన్నతో పాటు మరికొంతమంది వారి కుటుంబ సభ్యులను నారాయణరెడ్డి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ సహకారంతో తప్పించుకుని:
బీసన్నగారి కుటుంబంలో పలువురిని హతమార్చిన నారాయణరెడ్డి.. గత ప్రభుత్వంలో ఆ కేసుల విషయంలో రాజీ కుదుర్చుకున్నట్లు పోలీసులు చెప్పారు. నారాయణరెడ్డి హత్య రాజకీయాలను భరించలేక బీసన్నగారి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో కొన్నిరోజుల క్రితం రామాంజనేయులు వర్గం తిరిగి గ్రామానికి వచ్చింది. అయితే నారాయణరెడ్డికి భయపడి కుటుంబ సభ్యులు మాత్రం చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉండిపోయారు.
భయపడి బతకలేకనే హత్య:
నారాయణరెడ్డికి భయపడి బతకలేకనే ఆయన్ను హత్య చేశామని నిందితులు ఒప్పుకోవడం గమనార్హం. తాతలు, తండ్రులను చంపిన నాటి పగ, తమ ఇంటి ఆడవాళ్లను చెరబట్టారన్న కక్షతోనే నారాయణరెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. తమ సొంత పొలానికి కూడా నారాయణరెడ్డి కప్పం కట్టించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంకెన్నాళ్లు ఆయనకు భయపడి బతకాలన్న ఆలోచనతోనే హత్య చేశామన్నారు.
కొసనపల్లెకు వస్తారని తెలిసి:
చెరుకులపాడు నారాయణరెడ్డి కొసనపల్లె గ్రామానికి వస్తారని ఒకరోజు ముందే తెలియడంతో.. తమ వర్గీయులను కూడగట్టుకుని హత్య చేసేందుకు వెళ్లామన్నారు. దాడిలో పాల్గొన్నవాళ్లంతా తమ తమ ఇళ్లలోని ఆయుధాలనే తీసుకొచ్చారన్నారు. రామానాయుడు, రామాంజనేయులు తమ ట్రాక్టర్లు తీసుకురావడంతో.. వాటితోనే నారాయణరెడ్డి కారు ఢీకొట్టి హత్య చేశామన్నారు. ఆయనతో పాటు సాంబశివుడిని కూడా హత్య చేశామని అంగీకరించారు. ఈ హత్య వెనుక ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేదని నిందితులు స్పష్టం చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు:
సన్నగారి రామాంజనేయులు (చెరుకులపాడు), కోతుల రామాంజనేయులు(చెరుకులపాడు), కళ్లేవారి రామకృష్ణ (కొసనపల్లె), కోతుల రామాంజనేయులు (తొగరిచేడు), కోతుల బాలు (తొగరిచేడు), కోతుల చిన్న ఎల్లప్ప(తొగరిచేడు), గంటల వెంకటరాముడు (తొగరిచేడు), గంటల శ్రీను (తొగరిచేడు), బీసన్నగారి రామాంజనేయులు (తండ్రి చిన్న లక్ష్మన్న, చెరుకులపాడు), బీసన్నగారి రామాంజనేయులు (తండ్రి చిన్న బీసన్న, చెరుకులపాడు), బీసన్నగారి పెద్ద బీసన్న (చెరుకులపాడు). నిందితులకు సహకరించిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.