ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు: కర్నూలులో తక్కువ, తూర్పుగోదావరిలో అత్యధికం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కాగా, కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66,002 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 1221 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఏపీలో కొత్తగా 1221 కరోనా కేసులు
తాజాగా నమోదైన 1221 కరోనా కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 10 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6920కి చేరింది.
కర్నూలులో అల్పం.. తూగోలో ఎక్కువ కేసులు
కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా కొత్త కేసులు జిల్లాలా వారీగా.. అనంతపురంలో 41, చిత్తూరులో 175, తూర్పుగోదావరిలో 202, గుంటూరులో 144, కడపలో 65, కృష్ణాలో 198, కర్నూలులో 19, నెల్లూరులో 47, ప్రకాశంలో 50, శ్రీకాకుళంలో 34, విశాఖపట్నంలో 69, విజయనగరంలో 32, పశ్చిమగోదావరిలో 145 కేసులున్నాయి.
ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో 1829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,37,630కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,74,870 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
Recommended Video
దేశంలో నాలుగున్నర లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
మరోవైపు భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటి వరకు దేశంలో 90,21,020 కరోపా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
84,43,553 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,32,310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,43,124 యాక్టివ్ కేసులున్నాయి.