ఏపీలో వందకుపైగా కొత్త కరోనా కేసులు: పెరుగుతున్న యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 51,660 నమూనాలను పరీక్షించగా.. 124 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,441కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7172 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 94 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,369కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 900 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కరోనా కేసులు
కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,41,43,911 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 10, చిత్తూరులో 30, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 16, కడపలో 4, కృష్ణాలో 18, కర్నూలులో 4, నెల్లూరులో 6, ప్రకాశంలో 0, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 13,
విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 1 కరోనా కేసు నమోదయ్యాయి.
దేశంలో కరోనా హెచ్చుతగ్గులు.. వందలోపే మరణాలు
దేశంలో కరోనా కేసులు మరోసారి భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,838 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 113 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. కాగా, గురువారం ఒక్కరోజే 13,819 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.08 కోట్లకుపైబడింది. ప్రస్తుతం దేశంలో 1,76,319 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. మార్చి 4 నాటికి 1,80,05,503 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. గురువారం ఒక్కరోజే 13,88,170 మంది టీకాలు వేయించుకున్నారు.