నాడు చంద్రబాబు..నేడు వైఎస్ జగన్: విజయవాడ స్వరాజ్ మైదాన్: బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం
విజయవాడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి జగన్ సర్కార్ సన్నాహాలు చేపట్టింది. విజయవాడలోని స్వరాజ్ మైదాన్ దీనికి వేదికగా మారింది. స్వరాజ్ మైదాన్లో 125 అడుగల ఎత్తు గల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మితం కాబోతోంది. విగ్రహం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విగ్రహం నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
విదేశీ విద్యార్థులపై బాంబు పేల్చిన అమెరికా: స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిందే: విసాలన్నీ..
ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన చేసిన వెంటనే అప్పటి మంత్రి రావెల కిశోర్బాబు సహా పలువురు దళిత నాయకులు చంద్రబాబును సన్మానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులేవీ ముందకు సాగలేదు. ఆ విగ్రహాన్ని ఎక్కడ నిర్మిస్తారనేది కూడా అప్పట్లో ఖరారు కాలేదు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ దీన్ని తప్పుపట్టారు.
కనీసం స్థలం ఎక్కడో కూడా చెప్పకుండా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పడం పట్ల దళితులను అవమానించినట్లుగా ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విగ్రహం నిర్మాణ పనులు ప్రారంభిస్తామనీ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం.. విగ్రహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి. విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.
Recommended Video
అంబేద్కర్ స్మారక కేంద్రం, లైబ్రరీ, ఓ అధ్యయన కేంద్రం, ఓపెన్ ఎయిర్ థియేటర్ను నిర్మించబోతున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ పథకాల సమన్వయకుడు తలశిల రఘురాంతో కలిసి ఆయన స్వరాజ్ మైదాన్ను పరిశీలించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నందున.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు.