అక్కడ దుకాణమే లేదు.. కానీ జీఎస్టీ నెంబర్.. 13 కోట్ల పన్ను ఎగవేత..!
అమరావతి : జీఎస్టీ చట్టంలోని లొసుగులను వ్యాపారులు ఎంచక్కా ఎన్క్యాష్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఓ వ్యాపారి అడ్డదారుల్లో బిజినెస్ చేసి ప్రభుత్వానికి 13 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టిన వైనం వెలుగుచూసింది. ఇంత పెద్దమొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు ఆగమేఘాల మీద సదరు వ్యాపారిని పట్టుకోవాలని చూసినా వీలుకాలేదు. తప్పుడు చిరునామాతో అధికారులను బోల్తా కొట్టించారు ఆ బిజినెస్ మ్యాన్.
13 కోట్ల జీఎస్టీ పన్ను ఎగవేత..!
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశమైంది. ఏకంగా 13 కోట్ల రూపాయల జీఎస్టీ పన్ను ఎగ్గొట్టిన విషయం హాట్ టాపికయింది. స్థానికుడైన ఓ వ్యాపారి ఇనుము వ్యాపారం పేరిట జీఎస్టీ రిజిస్ట్రేషన్కు దాఖలు చేసుకున్నారు. అయితే అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే మంజూరు చేయడం గమనార్హం.
ఆ క్రమంలో సదరు జీఎస్టీ నెంబర్తోనే తన టర్నోవర్ను క్రమం తప్పకుండా ప్రతి నెల ఆన్లైన్లో ఫైల్ చేశారు. దాంతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వ్యాపారి ఆన్లైన్లో పొందుపరిచిన వివరాల మేరకు.. ఆ టర్నోవరు మేరకు పన్నులు కట్టించుకున్నారు. తీరా చూస్తే సదరు వ్యాపారి తక్కువ టర్నోవర్ చూపిస్తూ ప్రభుత్వానికి 13 కోట్ల రూపాయల మేర పన్ను ఎగ్గొట్టారనే విషయం వెలుగుచూసింది.
అక్కడ దుకాణమే లేదు.. కానీ, జీఎస్టీ నెంబర్
దాంతో గుంటూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆ వ్యాపారిపై దృష్టి సారించారు. ఆ క్రమంలో జీఎస్టీ పన్ను చెల్లించడంలో భారీ వ్యత్యాసముందని.. ఇంకా ఇంత మొత్తం చెల్లించాల్సి ఉందని పలుమార్లు నోటీసులు పంపించారు. అయినా అతడి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చివరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యాపారిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సదరు వ్యాపారి జీఎస్టీ నెంబర్ కోసం దాఖలు చేసిన దరఖాస్తులో పొందుపరిచిన అడ్రస్కు వెళ్లి విచారించారు. అయితే అక్కడి చిరునామాలో అలాంటి దుకాణం ఏదీ లేదని.. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం వచ్చింది. దాంతో పోలీసులతో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కంగుతిన్నారు.
బోగస్ సంస్థగా నిర్ధారణ
చివరకు అది బోగస్ వ్యాపార సంస్థ అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆ మేరకు తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర జీఎస్టీ అధికారులకు లేఖలు రాశారు ఇక్కడి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. ఈ వ్యాపారి ఒక్కరే కాకుండా ఇదే తరహాలో గుంటూరు, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో ఇంకో పదిమంది వ్యాపారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.