వైసిపిపై జూపూడి సంచలనం, కాపు రిజర్వేషన్: బాబుకు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేర్పాటు ఉద్యమాలకు బీజం వేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు బుధవారం నాడు మండిపడ్డారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద బ్లూ ప్రింట్ ఉందని చెప్పారు.
ప్రతిపక్షం ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టవద్దని జూపూడి హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.
ఏపీ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విశాఖలో అన్నారు. వాణిజ్య పన్నుల వసూళ్లను పెంచాలన్నారు. వాణిజ్య పన్నులు సక్రమంగా చెల్లించని వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి చెప్పాలన్నారు.
కాపుల రిజర్వేషన్లపై బాబుకు ఆర్ కృష్ణయ్య సూచన
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. టిడిపికే చెందిన తెలంగాణ ఎమ్మెల్యే, బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాత్రం ఆ ప్రతిపాదన విరమించుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నారు.
చంద్రబాబు తన ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, లేకుంటే బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న కులాలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని, ఈ అంశాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకోరాదన్నారు.
కాపులను బీసీల్లో చేర్చేందుకు బిసి కమిషన్ వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారని, ఈ నిర్ణయంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కాపులను బీసీల్లో చేరిస్తే బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి నష్టం వాటిల్లుతుందని ఆర్ కృష్ణయ్య అన్నారు.