నివర్ తుపానుపై అట్టుడికిన ఏపీ అసెంబ్లీ- చంద్రబాబు సహా 13 మంది ఎమ్మెల్యేల సస్పెండ్
నివర్ తుపాను బాధితులకు సాయం వ్యవహారం ఇవాళ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచడంతో పాటు పంట నష్ట సహాయం వెంటనే చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
నివర్ తుపాను కారణగంగా నెల్లూరు, చిత్తూరుతో పాటు ఇతర రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ సభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను గుర్తించే కార్యక్రమం జరుగుతోందని ప్రభుత్వం వివరణ ఇచ్చినా టీడీపీ శాంతించలేదు. దీంతో వైసీపీ కూడా ఎదురుదాడికే పరిమితమైంది. తుపాను బాధితులకు సాయం చేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించకుండా ఎదురుదాడి చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి పోడియం వద్ద బైఠాయించారు.
చంద్రబాబు తీరుపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుకు రైతాంగ సమస్యలపై అవగాహన లేదన్నారు సీఎం జగన్. అవగాహన లేకుండా బాబు వ్యవహరిస్తున్నారని జగన్ ఆక్షేపించారు. పంట నష్టం పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన బాబు హడావిడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రైతాంగానికి ఎంతో మేలు చేసిందన్నారు మంత్రి కన్నబాబు...ప్రధాన ప్రతిపక్షం విమర్శించడానికి ఏమీ లేక ఇలా చేస్తోందన్నారు. పరిణితి లేకుండా బాబు వ్యవహారం ఉందన్నారు మంత్రి కన్నబాబు.
చంద్రబాబు నిరసన తెలుపుతున్నా వైసీపీ నేతలు మాత్రం తమ ప్రసంగాలు కొనసాగించారు. టీడీపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతకీ గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ సూచనతో మంత్రి పేర్నినాని చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ తమ్మినేని దీన్ని ఆమోదించారు. తీర్మానం ప్రకారం 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. ఇవాళ సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో చంద్రబాబునాయుడు, బాలాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవానీ, గద్దె రామ్మోహన్, సత్యప్రసాద్, రామకృష్ణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ ఉన్నారు.