ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కొత్త కేసులంటే..?
అమరావతి: గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో కొద్దిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో వెయ్యికిపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఏపీలో కొత్తగా 1301 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67,269 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1301 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705కి చేరింది. తాజా మరణాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 6970కి చేరింది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు
ఇక ఒక్క రోజు వ్యవధిలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 56, చిత్తూరులో 102, తూర్పుగోదావరిలో 117, గుంటూరులో 172, కడపలో 55, కృష్ణాలో 162, కర్నూలులో 21, నెల్లూరులో 41, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 23, విశాఖపట్నంలో 84, విజయనగరంలో 29, పశ్చిమగోదావరిలో 126 కరోనా కేసులు నమోదయ్యాయి.
12వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో 1081 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 8,46,120కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగానూ స్వల్పంగా పెరిగిన కేసులు
దేశ వ్యాప్తంగానూ కరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో 44,489 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 92,66,705 చేరింది. ఇప్పటి వరకు 86,79,138 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,35,223 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్ కేసులున్నాయి. పండగలు, కాలుష్యం కారణంగా కరోనా కేసులు పలు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నాయి.