ఏపీలో కొత్తగా 135 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? మళ్లీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,970 నమూనాలను పరీక్షించగా.. 135 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,215కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల..
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7170 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 82 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,219కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 826 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,10,204 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 11, చిత్తూరులో 31, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 9, కడపలో 5, కృష్ణాలో 15, కర్నూలులో 10, నెల్లూరులో 5, ప్రకాశంలో 0, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 23,
విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా హెచ్చుతగ్గులు.. వందలోపే మరణాలు
దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,85,220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,989 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11.39,516కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 98 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,346కు చేరింది. కాగా, నిన్న ఒక్కరోజే 13,123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.08 కోట్లకు కు చేరింది. దేశంలో రికవరీ రేటు 97.06శాతంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి.